Gurthundha seethakalam | వాస్తవికతకు దగ్గరగా ఉండే కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో నటిస్తూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు సత్యదేవ్. ఈయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం గుర్తుందా శీతాకాలం. నాగశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సత్యదేవ్ కు జోడిగా తమన్నా, మేఘా ఆకాశ్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రం బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి గుర్తుందా శీతాకాలం అనే పాటను మేకర్స్ విడుదల చేశారు.
‘క్యాచ్ పడితే అవుటవుతారే..బయట పడితే సిక్సంటారే..వెంట పడితే ప్రేమంటారే..కంటపడితే తిడుతుంటారే’ అంటూ సాగే ఈ ప్రేమ గీతాన్ని శ్రీమణి రచించగా కాలభైరవ ఆలపించాడు. ఈ చిత్రం కన్నడలో సూపర్ హిట్టయినా లవ్ మాక్టైల్ చిత్రానికి రీమేక్గా తెరకెక్కుతుంది. నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్, వేదాక్షర ఫిల్మ్స్ బ్యానర్ల పై నాగశేఖర్,రామారావుచింతపల్లి, ఎమ్ఎస్ రెడ్డి, చినబాబు,భావనరవి కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు.