గణేష్ బెల్లంకొండ, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న సినిమా ‘స్వాతిముత్యం’. ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 5న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర ట్రైలర్ను హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో గణేష్ బెల్లంకొండ మాట్లాడుతూ…‘ఈ కథ వినగానే మన ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్మాను. సితార సంస్థ దగ్గరకు తీసుకెళ్లాం.
ఈ చిత్రం ఇంత బాగా రావడానికి నిర్మాత వంశీ కారణం. ఈ సినిమాతో మొదటిసారి తెరపై నన్ను నేను చూసుకుంటున్నా. హీరో అంటే ఎలా ఉండాలో తెలియదు. ట్రైలర్లో చూసినట్లు సినిమా అంతా సరదాగా మన ఇంట్లోనో, ఇరుగు పొరుగు ఇళ్లలో జరిగినట్లు ఉంటుంది. థియేటర్స్లో సినిమాను ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాం’ అన్నారు. దర్శకుడు లక్ష్మణ్ కె కృష్ణ మాట్లాడుతూ…‘రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా కాదిది. ఒక కొత్త పాయింట్ ఇందులో ఉంది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన అబ్బాయికి వెంటనే పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తే అప్పుడు ఆ అబ్బాయి ఎలాంటి ఇబ్బందుల్లో పడ్డాడు అనేది వినోదాత్మకంగా చూపిస్తున్నాం.
అబ్బాయి జీవితంలోకి వచ్చిన విచిత్రమైన సమస్య ఏంటి? దాన్ని అతను ఎలా పరిష్కరించుకున్నాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది’ అన్నారు. ‘ప్రతిభ ఉన్న కొత్త వాళ్లను ప్రోత్సహిస్తున్న సితార సంస్థకు థాంక్స్. ఈ సినిమా మా అందరికీ పేరు తెస్తుందని ఆశిస్తున్నాం’ అని నాయిక వర్ష బొల్లమ్మ అన్నారు. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ…‘దర్శకుడు కథ చెప్పినప్పుడు ఆ పాత్రకు సరిపోయేలా అమాయకంగా ఉండే కొత్త హీరో కావాలనుకున్నాం. అలా గణేష్ను ఎంచుకున్నాం. పండగ సమయాల్లో చూసి ఆనందించే కుటుంబ కథా చిత్రమిది. అందుకే దసరాకు విడుదల చేస్తున్నాం’ అని అన్నారు.