ప్రేమ పేరుతో ఓ ప్రముఖ నిర్మాత తనను చిత్ర హింసలకు గురిచేశాడని వెల్లడించింది ప్రముఖ నటి ఆశా షైనీ. కెరీర్ తొలినాళ్లలో అతని వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డానని గుర్తు చేసుకుంది. ఆ చేదు జ్ఞాపకాలు మర్చిపోయి ప్రస్తుతం మళ్లీ ప్రేమలో పడ్డానని చెప్పింది. తాజాగా సోషల్ మీడియా ద్వారా ఆశా షైనీ స్పందిస్తూ…‘అప్పుడు నా వయసు 20 ఏండ్లు. నటిగా, మోడల్గా పేరు తెచ్చుకుంటున్నాను. పది సినిమాల్లో నటించాను. పేరున్న బ్రాండ్స్కు మోడల్గా పనిచేస్తున్నా. అలాంటి సమయంలో ఓ ప్రముఖ నిర్మాత ప్రేమ పేరుతో నన్ను నమ్మించాడు. 14 నెలలు చిత్రహింసలకు గురిచేశాడు.
భౌతికంగా దాడి చేశాడు. సినిమాల్లో నటించకూడదని షరతు పెట్టి నా ఫోన్ లాక్కున్నాడు. కుటుంబ సభ్యులతోనూ మాట్లాడకుండా చేశాడు. ఎలాగోలా అతని నుంచి తప్పించుకుని మా ఇంటికి పారిపోయా. ఆ గాయాలు మానడానికి కొన్ని నెలల సమయం పట్టింది. ఆ చీకటి రోజులు మర్చిపోయి ఇప్పుడు మళ్లీ కెరీర్ కొనసాగిస్తున్నాను. ఓ మంచి వ్యక్తి పరిచయం ద్వారా మళ్లీ ప్రేమను పొందాను’ అని పేర్కొంది. ఆ నిర్మాత పేరును మాత్రం ఆమె వెల్లడించలేదు. తెలుగులో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘నరసింహనాయుడు’, ‘143’, ‘ప్రేమతో రా’ వంటి చిత్రాల్లో నటించింది ఆశా షైనీ. గతేడాది వరుణ్ ధావన్ ‘భేడియా’ చిత్రంలో మంచి పాత్రలో నటించి ఆకట్టుకుంది.