‘దిల్రాజు, శిరీష్ కథల్ని ఎంపిక చేసుకునే విధానంలో ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఎందరో కొత్త దర్శకులను తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత వారికి దక్కుతుంది. తెలుగు సినిమా పరిశ్రమకు దిల్రాజు ఎంతో సేవ చేస్తున్నారు’ అని అన్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. సోమవారం జరిగిన ‘ఎఫ్-3’ ట్రిపుల్ బ్లాక్బస్టర్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై యూనిట్ సభ్యులకు జ్ఞాపికల్ని అందజేశారు. వెంకటేష్, వరుణ్తేజ్ హీరోలుగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై విజయపథంలో పయనిస్తున్నది. ఈ సందర్భంగా దిల్రాజు మాట్లాడుతూ ‘మూడోవారంలో కూడా సినిమాకు మంచి వసూళ్లు రావడం విజయానికి నిదర్శనంగా భావిస్తున్నాం.
ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా ప్రేక్షకుల అద్భుతమైన ఆదరణ కనబరుస్తున్నారు. ఈ సినిమా విషయంలో మాపై నమ్మకం ఉంచిన పంపిణీదారులందరికి కృతజ్ఞతలు. కరోనా తర్వాత సినీ పరిశ్రమలో చాలా మార్పులొచ్చాయి. ఇంకా రాబోతున్నాయి. సినిమా విజయం సాధిస్తే షీల్డ్స్ ఇవ్వడం నాకు చాలా ఇష్టం. అదొక గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది’ అన్నారు. ‘నేను ప్రేక్షకుల దృష్టికోణం నుంచి కథ రాస్తుంటాను. ప్రతి సినిమాకు ఎంతో కొంత నేర్చుకుంటున్నా. మూడో వారంలో కూడా హౌస్ఫుల్స్ అవుతున్నాయంటే ఇదే అసలైన విజయంగా భావిస్తున్నా’ అని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. వరుణ్తేజ్ మాట్లాడుతూ ‘నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఆనందంగా ఉంటే నటీనటులు కూడా హ్యాపీగా ఫీలవుతారు. ఈ సినిమా విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’ అని వరుణ్తేజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.