తమిళనాట తిరుగులేని అభిమానగణంతో అగ్ర కథానాయకుడిగా చలామణి అవుతున్నారు తళపతి విజయ్. అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు. తాజాగా ఆయన తెలుగు అగ్ర దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్రాజు, శిరీష్ తెరకెక్కించబోతున్నారు. ఆదివారం ఈ సినిమా తాలూకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ చిత్రం ద్వారా దిల్రాజు తమిళ చిత్రసీమలో నిర్మాతగా అరంగేట్రం చేయబోతున్నారు. ‘విజయ్ నటిస్తున్న 66వ చిత్రమిది. భారీ స్థాయిలో తెరకెక్కించబోతున్నాం. మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం’ అని నిర్మాణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో విజయ్ ‘బీస్ట్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇది పూర్తవగానే దిల్రాజు నిర్మించబోయే సినిమాను పట్టాలెక్కించబోతున్నారు.