స్టార్ హీరో చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకుడు. తమన్నా నాయికగా నటిస్తున్నది. కీర్తి సురేష్ చిరంజీవి సోదరి పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్తో కలిసి అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో నిర్మిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా పాటల సందడికి సిద్ధమవుతున్నది. ఈ సినిమా పాటల కోసం స్విట్జర్లాండ్ వెళ్లినట్లు ఇటీవల చిరంజీవి సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
అక్కడి అందమైన లొకేషన్స్లో తమన్నాతో కలిసి సాంగ్ షూట్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక తాజాగా ‘భోళా శంకర్’ మ్యూజిక్ మేనియా మొదలుపెడుతున్నామంటూ చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. చిరంజీవి సినిమాల్లో పాటలకు, డ్యాన్సులకు ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. ఇందులోనూ అదే స్థాయిలో పాటలు ఉంటాయని చెబుతున్నారు. చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ సినిమా ఆగస్టు 11న విడుదలకు సిద్ధమవుతున్నది. రఘుబాబు, రావు రమేష్, మురళీశర్మ, రవిశంకర్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : డుడ్లీ, ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్.