‘సినిమా ఫిలాసఫీ మారిపోయింది. ప్రేక్షకులు ఇంట్లోనే ఉండి సినిమాలు చూస్తున్నారని మనం బాధపడాల్సిన అవసరం లేదు. సినిమా కంటెంట్ బాగుంటే తప్పకుండా థియేటర్లకే వస్తారు. అలాంటి మంచి కథల్ని మనం చెప్పగలగాలి’ అన్నారు అగ్ర నటుడు చిరంజీవి. బుధవారం జరిగిన ‘ఫస్ట్డే ఫస్ట్షో’ చిత్ర ప్రీరిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీకాంత్ రెడ్డి, సంచితబసు జంటగా నటించిన ఈ చిత్రానికి వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ దర్శకత్వం వహించారు.
ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మించారు. నేడు విడుదల కానుంది. చిరంజీవి మాట్లాడుతూ ‘కొవిడ్ తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదన్నది కేవలం అపోహ మాత్రమే. ఓటీటీ, యూట్యూబ్.. వంటి ప్లాట్ఫామ్స్లో సినిమాల్ని వీక్షిస్తున్నా.. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. లేదంటే రెండో రోజే సినిమా వెళ్లిపోతుంది. ఈ విషయంలో నేనూ బాధితుడినే (నవ్వుతూ). సినిమా కథాంశాల గురించి దర్శకులు విస్త్రతంగా చర్చించుకోవాలి.
తమ సినిమాలో ఏం ఉందని ప్రేక్షకులు చూడాలి? అని ప్రశ్నించుకోవాలి. అప్పుడే మంచి సినిమాలొస్తాయి. డేట్స్ దొరకగానే హడావిడిగా సినిమాల్ని తెరకెక్కించొద్దు’ అని చిరంజీవి సూచించారు. నిర్మాత ఏడిద నాగేశ్వరరావుతో తనకు ఎంతో అనుబంధం ఉందని, వారి కుటుంబ సభ్యుల్లో తాను ఒకడిగా ఫీలవుతానని ఆయన అన్నారు. మహిళలు సినిమాల్లోకి వస్తానంటే తాను ప్రోత్సహిస్తానని, తెలుగు ఇండస్ట్రీ మహిళలకు ఎంతో గౌరవం ఇస్తుందని చిరంజీవి పేర్కొన్నారు.