Annapoorani | లేడీ సూపర్స్టార్ నయనతార నటించిన అన్నపూరణి సినిమాపై వివాదాలు మరింత ముదురుతున్నాయి. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఈ సినిమా ఉందంటూ పలు హిందూ సంఘాలు చిత్రబృందంపై మండిపడుతున్నారు. వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేస్తున్నారు. ఇప్పటికే శివసేన మాజీ నేత రమేశ్ సోలంకి మహారాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తాజాగా మధ్యప్రదేశ్లోని జబల్పూర్లోనూ కేసు నమోదయ్యింది.
అన్నపూరణి సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన నయనతార, డైరెక్టర్ నీలేశ్ కృష్ణ, నిర్మాతలు జతిన్ సేథి, ఆర్ రవింద్రన్తో పాటు నెట్ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్పై జబల్పూర్లోని ఒంటి పీఎస్లో కేసు నమోదైంది. రాముడిని కించపరచడంతో పాటు లవ్ జిహాద్ను ప్రోత్సహించేలా సినిమా ఉందని హిందూ సేవా పరిషత్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేశారు.
అన్నపూరణి సినిమా గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన థియేటర్లలో రిలీజయ్యింది. సినిమా విడుదలైన తర్వాత 28 రోజుల్లోనే నెట్ఫ్లిక్స్లోనే స్ట్రీమింగ్కు వచ్చింది. థియేటర్లో పెద్దగా ఈ సినిమాను చూడకపోయినప్పటికీ.. ఓటీటీలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే సినిమాను చూసిన పలు హిందూ సంఘాలు చిత్ర యూనిట్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బజరంగ్ దళ్, హిందూ ఐటీ సెల్ ముంబైలో ఇప్పటికే ఓ కేసు కూడా పెట్టారు. అన్నపూరణి సినిమాకు వివాదాలు చుట్టుముడుతుండటంతో ఇప్పటికే నెట్ఫ్లిక్స్ అప్రమత్తమైంది. తమ ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి ఈ సినిమాను డిలీట్ చేసింది. డిలీట్ అయిన ఈ చిత్రం ఇప్పుడు సింప్లీ సౌత్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది.