‘ఉయ్యాల జంపాల’ చిత్రంతో కథానాయికగా అరంగేట్రం చేసి మంచి గుర్తింపును సంపాదించుకుంది అవికాగోర్. అనంతరం పలు చిత్రాల్లో తన అభినయంతో మెప్పించింది. ప్రస్తుతం ఆమె ‘పాప్కార్న్’ చిత్రంలో కథానాయికగా నటించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నది. సాయిరోనక్ హీరోగా మురళిగంధం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నేడు విడుదలకానుంది. ఈ సందర్భంగా గురువారం అవికాగోర్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘90శాతం లిఫ్ట్లో జరిగే కథ ఇది. రెండు గంటల పాటు నాయకా నాయికలే కనిపిస్తారు. అయినా కథ ఎక్కడా బోర్ కొట్టదు. ఆసక్తికరమైన స్క్రీన్ప్లేతో తీర్చిదిద్దారు.
నటనాపరంగా నేను సవాళ్లకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. కథ వినగానే ఇలాంటి సినిమాతోనే నిర్మాతగా పరిచయం కావాలనిపించింది. అందుకే ధైర్యంగా తొలి అడుగు వేశా. స్క్రిప్ట్ విషయంలో నేను ఏమాత్రం జోక్యం చేసుకోలేదు. దర్శకుడికి పూర్తి స్వేచ్ఛనిచ్చాను. ప్రొడక్షన్ గురించి కొన్నేళ్లుగా ఆలోచిస్తున్నా. కథ బాగా నచ్చడంతో ఈ సినిమాతో కుదిరింది. నాగార్జున, నాగచైతన్య, నిఖిల్ సినిమా బాగుందని మెచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగులో కొన్ని సినిమాలు చేస్తున్నా. వాటి వివరాల్ని త్వరలో తెలియజేస్తా. హిందీలో ‘1920’ అనే చిత్రంలో నటిస్తున్నా. మే నెలలో విడుదలవుతుంది’ అని చెప్పింది.