దక్షిణాది చిత్ర పరిశ్రమ అంటే తన కుటుంబానికి ఎంతో గౌరవమని, ఇక్కడ నటించాలని కోరుకుంటున్నట్లు గతంలో అనేకసార్లు చెప్పింది బాలీవుడ్ తార జాన్వీ కపూర్. దిగ్గజ నటి శ్రీదేవి కూతురైన జాన్వీ హిందీ చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకుంది. తెలుగు, తమిళ సినిమాల్లో నటించాలని ఎదురుచూస్తున్నట్లు ఇటీవల తన చిత్ర ప్రచార కార్యక్రమంలోనూ వెల్లడించింది. ఆమె ఆశించినట్లే ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 30వ సినిమాలో అవకాశం దక్కించుకుంది.
ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఆమెను ఈ మూవీ టీమ్ సంప్రదించడం, ఆమె అంగీకరించడం జరిగాయట. ఇక త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాలో నటించేందుకు తన షెడ్యూల్స్ అన్నీ సెట్ చేసుకుంటున్నదట జాన్వీ. ఎన్టీఆర్తో నటించే చిత్రాన్ని తనకు ప్రాధాన్యతగా పెట్టుకుందట. తొలి సౌత్ ప్రాజెక్ట్ కాబట్టి ఈ సినిమా తనకెంతో ప్రత్యేకమని జాన్వీ భావిస్తున్నట్లు సమాచారం.
కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ మార్చి 20 నుంచి తన కొత్త సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తామని తెలిపారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జాన్వీకి తొలి పాన్ ఇండియా మూవీ కానుంది.