ఈ ఏడాది ‘నాంది’ చిత్రంతో చక్కటి విజయాన్ని అందుకున్నారు హీరో నరేష్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సభకు నమస్కారం’ గురువారం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈస్ట్కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. సతీష్ మల్లంపాటి దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి నరేష్ కుమార్తె అయాన క్లాప్నివ్వగా, పోకూరి బాబూరావు కెమెరా స్విఛాన్ చేశారు. ‘నాంది’ దర్శకుడు విజయ్ కనకమేడల గౌరవ దర్శకత్వం వహించారు. ‘నరేష్ నటిస్తున్న 58వ చిత్రమిది. పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కించబోతున్నాం. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్లుక్ పోస్టర్కు అద్భుతమైన స్పందన లభిస్తోంది’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఛోటా కె నాయుడు, సంగీతం: శ్రీచరణ్ పాకాల, సంభాషణలు: అబ్బూరి రవి.