Nagarjuna-Akhil Multistarrer | సీనియర్ అగ్ర కథానాయకుడు నాగార్జున ప్రస్తుతం వరుసగా సినిమాలను ఒప్పుకుంటున్నాడు. ఇప్పటికే ఈయన నటించిన ‘బ్రహ్మస్త్ర’ విడుదలకు సిద్ధంగా ఉండగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ఘోస్ట్’ షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రం అనంతరం నాగార్జున, చిరంజీవితో ‘గాడ్ ఫాదర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న మొహన్రాజా దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్నాడు. ఇందులో విశేషం ఏంటంటే ఈ చిత్రం నాగార్జునకు 100వ చిత్రంగా తెరకెక్కనుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ చిత్రంలో నాగార్జునతో పాటు అక్కినేని అఖిల్ కూడా నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే మనం సినిమాలో అఖిల్, తండ్రితో కలిసి స్క్రీన్ను షేర్ చేసుకున్నాడు. మనం సినిమాలో అఖిల్ గెస్ట్ రోల్ చేయగా ఈ చిత్రంలో మాత్రం ఫుల్ లెంగ్త్ పాత్రలో నటించనున్నాడట. అయితే ఈ చిత్రం తాజాగా మలయాళంలో సూపర్ హిట్టయిన ‘బ్రో డాడీ’ చిత్రానికి రీమేక్గా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ చిత్రంలో నటిస్తున్నాడు. సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నాడట.