తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యద్బుతమైన చిత్రాలు తెరకెక్కుతున్ననేపథ్యంలో బాలీవుడ్ స్టార్స్ వీటిని రీమేక్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే పలు తెలుగు చిత్రాలు హిందీలో రీమేక్ కాగా, ఇప్పుడు మరో మూవీ రీమేక్కు సిద్ధమవుతుంది. అల్లరి నరేష్ నటించిన కోర్ట్ డ్రామా నాంది చిత్రం కొద్ది రోజుల క్రితం థియేటర్లో విడుదల కాగా, ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నరేష్,వరలక్ష్మీ శరత్ కుమార్ నటన, విజయ్ కనకమేడల దర్శకత్వం సినిమా సక్సెస్లో భాగం అయ్యాయి. శతమానం భవతి దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇప్పుడు నాంది చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నారు. అజయ్ దేవగణ్, దిల్ రాజు కలిసి ఈ ప్రాజెక్ట్ని త్వరలో పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పరిపాలనలోని లొసుగులని తెలియజేసే చిత్రంగా నాంది తెరకెక్కింది. తెలుగు వర్షెన్ ఎంతో అద్భుతంగా ఉంది. ఇది నా మనసుకు తాకడంతో ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడంలో చేతులు కలిపాను. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తాను అని అజయ్ దేవగణ్ పేర్కొన్నారు. పరాగ్ దేశాయ్, దిల్ రాజు, కుల్దీప్ రాథోడ్తో కలిసి అజయ్ దేవగణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు సమాచారం.