‘దిస్ ఈజ్ కాంగ్రెస్ రేడియో కాలింగ్ ఫ్రమ్ 42.34 మీటర్స్ ఫ్రమ్ సమ్వేర్ ఇన్ ఇండియా’ ఈ మాటలు ఎక్కడ పుట్టాయో కొందరికే తెలుసు! కానీ, ఆ మాటలు బ్రిటిష్ కోటలను బద్దలు కొట్టేలా ప్రతి భారతీయుడినీ పురిగొల్పాయి. తెల్లదొరల గుండెల్లో తూటాలు పేల్చిన ఆ మాటలు పలికిన వ్యక్తి ఉషా మెహతా! స్వరాజ్య సమరంలో ‘వందేమాతరం’ అని నినదించిన శక్తి. ఆమె జీవితం ఆధారంగా నిర్మించిన‘యే వతన్ మేరే వతన్’ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్నది. ఉష పాత్రలో సారా అలీఖాన్ మెప్పించింది. స్వాతంత్య్రోద్యమ ఘట్టంలో పేరెన్నికగన్న ‘రహస్య రేడియో’ అంకం ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్.
Usha Mehta | కొన్ని త్యాగాలను కాలం విస్మరించిందేమో అనుకుంటాం! చరిత్ర పట్టించుకున్నట్టూ అనిపించదు!! ‘నాలుగేండ్ల తర్వాత నిన్నెవరూ గుర్తుపట్టకపోవచ్చు. కొందరికి ప్రశంసలు లభిస్తాయి. కొందరికి ప్రేమ లభిస్తుంది! కానీ, చాలామంది చరిత్ర పుటల్లో అజ్ఞాతంగా మిగిలిపోతారు..’ ఈ మాటలు ‘యే వతన్…’ సినిమాలో వినిపిస్తాయి. ఉష జీవితానికి ఈ మాటలు అచ్చంగా సరిపోతాయి. కానీ, చరిత్రను తరచి చూస్తే ఈ అజ్ఞాత వ్యక్తి చేసిన అద్భుతం ఏ మూలో సువర్ణాక్షరాలతో కనిపిస్తుంది. ఇన్నాళ్లూ మనం చూడలేదంతే! అందరూ అంతగా గుర్తు పట్టుకోని ఉష కథను ఉదాత్తమైన సినిమాగా తీసుకురావడం మంచి ప్రయత్నమే! బయోపిక్ యుగం నడుస్తున్న బాలీవుడ్లో ఈ అజ్ఞాత ఉద్యమకారిణి జీవితాన్ని చిత్రికపట్టి సినిమాగా తీసుకురావడం గొప్ప విషయమే!!
ఉషా మెహతాది విద్యాధికుల కుటుంబం. 1920లో జన్మించింది. గుజరాత్లోని సూరత్ జిల్లా సరన్ ఆమె స్వగ్రామం. గాంధీజీ పుట్టిన రాష్ట్రం. స్వతంత్ర ఉద్యమ గీతాలు వింటూ పెరిగింది. ఆటలాడుకునే వయసులో నిరసనకారుల ప్రదర్శనలు చూస్తూ వచ్చింది. పసితనంలోనే దేశభక్తిని అందిపుచ్చుకుంది. తండ్రి బ్రిటిష్ కోర్టులో తీర్పులు ఇచ్చే న్యాయమూర్తి. కూతురు వ్యవహారం అతనికి పెద్దగా నచ్చేది కాదు! తండ్రి వైఖరిని ఆమె కూడా పట్టించుకునేది కాదు. తన ఆరాటం అంతా స్వతంత్ర పోరాటం గురించే! అలాగని చదువులు నిర్లక్ష్యం చేయలేదు. మెట్రిక్యులేషన్లో మంచి మార్కులు సాధించింది. సైకాలజీలో డిగ్రీ పట్టా అందుకుంది. మరోవైపు కాంగ్రెస్ సదస్సులకు తరచూ హాజరయ్యేది. పోరాటంలో ముందుండి పాల్గొనేది. డిగ్రీ తర్వాత న్యాయవిద్యలో రాణించాలని భావించింది. కానీ, ‘క్విట్ ఇండియా’ ఉద్యమం మొదలుకావడంతో అందులోకి దూకింది.
అప్పట్లో పత్రికలే ప్రచార సాధనాలు. ఢిల్లీలో బాపూజీ పిలుపు ఇస్తే.. మారుమూల భారతానికి చేరేసరికి రెండురోజులు పట్టేది. ఉద్యమకారులపై ఎక్కడైనా ఆంగ్లేయులు దాడికి దిగితే.. ఆ సంగతి ఏ పక్షం రోజులకో ప్రజలకు చేరేది. ఉద్యమ స్ఫూర్తి ఆగమేఘాల మీద జనాలకు చేరువ కావాలంటే రేడియో ఒక్కటే మార్గం అనుకున్నారు కాంగ్రెస్ నాయకులు. వారిలో ఉషా మెహతా ఒకరు. ఆమె 1942 ఆగస్టు 14న కాంగ్రెస్ రేడియోను నెలకొల్పారు. ముంబయిలోని చౌపట్టి ప్రాంతంలో ఓ భవనంలో రేడియో కేంద్రం నిర్వహించారు. ఆగస్టు 27 నుంచి ప్రసారాలు మొదలయ్యాయి. బ్రిటిష్ పోలీసులకు అనుమానం వచ్చినప్పుడల్లా సరంజామా అంతా మరోచోటికి చేరవేసేవారు. ఉషతోపాటు మరికొందరు ఉద్యమకారులు పొద్దంతా రేడియో పనిలో తలమునకలయ్యేవారు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఓ అరగంటపాటు ఆనాటి విశేషాలను ప్రసారంచేసేవారు ఉష! మహాత్మాగాంధీతోపాటు ఇతర కాంగ్రెస్ నాయకుల ప్రసంగాలు కూడా ప్రసారం అయ్యేవి. వందేమాతరం గీతంతో ఆ పూట ప్రసారం ముగించేవారు.
రహస్య రేడియోగా వినుతికెక్కిన కాంగ్రెస్ రేడియో.. క్విట్ ఇండియా ఉద్యమానికి ఇచ్చిన స్ఫూర్తి అంతా ఇంతా కాదు! రేడియో ప్రారంభమైన వారం నుంచే బ్రిటిష్ అధికారుల్లో కలకలం మొదలైంది. ‘ఇన్నాళ్లూ ఉద్యమం సాగింది.. ఈ రేడియో ఇలాగే కొనసాగితే విప్లవం బయల్దేరుతుంద’న్న భయాలు వారిలో మొదలయ్యాయి. ఉష బృందానికి అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేక బలగాలు బరిలోకి దిగాయి. బొంబాయి నగరమంతా గాలించాయి. 1942 నవంబర్ 12.. సాయంత్రం యథావిధిగా కాంగ్రెస్ రేడియోలో ప్రసారాలు మొదలయ్యాయి. పోలీసులు తమపై దాడికి వస్తున్నారని ఉషకు సమాచారం అందింది. వాళ్లు రాకముందే కొన్ని డాక్యుమెంట్లు మాయం చేసింది. కాసేపటికి పోలీసులు వచ్చారు. ఉషను పట్టుకున్నారు. ప్రసార సామగ్రిని ధ్వంసం చేశారు. ఆమెను ఈడ్చుకెళ్లారు. మర్నాటి నుంచి విచారణ. మహిళ అని కూడా చూడకుండా చిత్రహింసలు పెట్టారు. ఉద్యమ రహస్యాలు చెప్పాల్సిందిగా చిత్రవధ చేశారు. పై చదువులకు విదేశాలకు పంపుతామని ఆశ చూపారు. రేడియోలో కంగుమనే ఆమె కంఠం పోలీసుల ఎదుట మూగబోయింది. ఉద్యమ లక్ష్యం కోసం ఒక్క మాటా చెప్పలేదు. కోర్టులో విచారణ తర్వాత ఉషకు నాలుగేండ్ల జైలు శిక్ష పడింది. పుణేలోని ఎరవాడ జైలుకు తరలించారు.
నాలుగేండ్ల తర్వాత 1946లో ఉష విడుదలయ్యారు. ఆ మరుసటి ఏడాది దేశానికి స్వతంత్రం వచ్చింది. ఉషా మెహతా కల నెరవేరింది. పై చదవులు చదివారు. పీహెచ్డీ చేశారు. బొంబాయి విశ్వవిద్యాలయం విల్సన్ కళాశాలలో 30 ఏండ్లపాటు ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. 1998లో ఆమెను ప్రభుత్వం ‘పద్మవిభూషణ్’తో సత్కరించింది. తర్వాత రెండేండ్లకు ఉష మెహతా గొంతు శాశ్వతంగా మూగబోయింది. కానీ, భారత స్వతంత్ర పోరాటంలో వినిపించిన ఆమె వాణి అమరత్వాన్ని పొందింది.