జీవితకథల్లో నటించడమంటే నాకు ఇష్టం. అవకాశం వస్తే ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, రేఖ పాత్రలు చేయాలనుంది’ అని చెప్పింది అదితీరావ్ హైదరీ. ఆమె హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’. శర్వానంద్, సిద్ధార్థ్ కథానాయకులుగా నటించారు. అజయ్భూపతి దర్శకుడు. ఈ నెల 14న విడుదలకానుంది. సోమవారం హైదరాబాద్లో అదితీరావ్ హైదరీ పాత్రికేయులతో ముచ్చటించింది. ఆ విశేషాలివి..
నా పాత్ర దృక్కోణం నుంచే ఈ కథ సాగుతుంది. ఇందులో నేను వైజాగ్కు చెందిన మహా అనే అమ్మాయిగా కనిపిస్తా. కష్టపడేతత్వం, ఆత్మైస్థెర్యం కలిగి కుటుంబ బాధ్యతల్ని స్వీకరించే యువతిగా నా క్యారెక్టర్ విభిన్నంగా ఉంటుంది. విజయ్, అర్జున్ అనే యువకులతో ఆమెకున్న సంబంధమేమిటన్నది ఆకట్టుకుంటుంది. రెండేళ్ల క్రితం దర్శకుడు అజయ్భూపతి ఈ కథను వినిపించారు. మహా పాత్రను నేనే చేయాలని పట్టుబట్టారు. సినిమాల పట్ల ఆయనకున్న ప్రేమ, తపన నన్ను ఆకట్టుకున్నాయి. నాకు ప్రేమకథలంటే చాలా ఇష్టం. కొలవలేనంత ప్రేమతో పాటు స్నేహం ఔన్నత్యాన్ని చాటుతూ ఈ సినిమా సాగుతుంది. నాతో పాటు ప్రతి పాత్ర ఛాలెంజింగ్గా ఉంటుంది.
దర్శకులే నా గురువులు
నిత్యవిద్యార్థిలా ప్రతిరోజు సెట్స్కు వస్తాను. నన్ను నేను స్టార్గా ఎప్పుడూ భావించుకోను. నిరంతరం కొత్త విషయాల్ని నేర్చుకోవడానికే ప్రాముఖ్యతనిస్తా. దర్శకులను నా గురువులా భావిస్తా. వారు చెప్పినట్లుగానే నటిస్తా. దర్శకుల సూచనలతో పాటు నా శైలి హంగులను జోడిస్తూ పాత్రలకు ప్రాణం పోసేందుకు కష్టపడతా. మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న ‘పొన్నియన్ సెల్వన్’లో అవకాశం రాకపోవడం పట్ల బాధలేదు. తాను సృష్టించిన పాత్రలకు సరిపోతారనే నమ్మకం కుదిరిన వారినే మణిరత్నం తన సినిమాల్లో తీసుకుంటారు. అందులో నాకు తగిన పాత్ర ఏది లేదనుకుంటున్నా. ప్రస్తుతం తమిళంలో దుల్కర్సల్మాన్తో ఓ సినిమా చేస్తున్నా. హిందీ, మలయాళంలో కొన్ని సినిమాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి.