‘చిన్న పాత్రలు చేస్తే చాలనుకున్నా. కానీ ఇప్పుడు విభిన్న కథలు నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రతి పాత్రకు వందశాతం న్యాయం చేయాలనే తపనతో పనిచేస్తున్నా’ అన్నారు యువ హీరో సుహాస్. ఆయన నటించిన తాజా చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. షణ్ముఖ ప్రశాంత్ దర్శకుడు. ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో సుహాస్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో కడుపుబ్బా నన్వించే వినోదంతో పాటు హృదయాన్ని కదిలించే భావోద్వేగాలుంటాయి.
కథలోని మలుపులు ఉత్కంఠను పంచుతాయి. థియేటర్లో విడుదలవున్న నా తొలి చిత్రమిదే కావడం సంతోషంగా ఉంది. ‘కలర్ఫొటో’ చిత్రం నా కెరీర్లో టర్నింగ్ పాయింట్లా నిలిచింది. ప్రస్తుతం మంచి అవకాశాలొస్తున్నాయి. షార్ట్ ఫిల్మ్స్ నుంచి వెండితెరపై వరకు నా ప్రయాణాన్ని తలచుకుంటే చాలా గర్వంగా అనిపిస్తున్నది. ‘రైటర్ పద్మభూషణ్’ చూసిన ప్రేక్షకులు థియేటర్ నుంచి చిరునవ్వుతో బయటకొస్తారు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్లో చేస్తున్న సినిమా షూటింగ్ పూర్తయింది. దీని తర్వాత ‘ఆనందరావు అడ్వెంచర్స్’ పేరుతో ఓ సినిమా చేస్తున్నా’ అని అన్నారు.