Middle East Crisis | మిడిల్ ఈస్ట్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన భారతీయ నటి సోనాల్ చౌహాన్, తనను క్షేమంగా స్వదేశానికి తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య దాడులు తీవ్రతరం కావడంతో గల్ఫ్ దేశాల మీదుగా విమాన రాకపోకలను భారత్ నిలిపివేసింది. దీంతో వందలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్టులోనే ఉండిపోవాల్సి వచ్చింది.
అయితే తన పరిస్థితిని ప్రధానికి సోషల్ మీడియా వేదికగా సోనల్ వివరిస్తూ.. “గౌరవనీయులైన ప్రధాని మోదీ గారు, ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం వల్ల నేను దుబాయ్లో చిక్కుకుపోయాను. విమానాలన్నీ రద్దయ్యాయి, భారత్కు తిరిగి రావడానికి మార్గం కనిపించడం లేదు. ప్రభుత్వం స్పందించి తగిన మార్గదర్శకాలు అందించి, నేను క్షేమంగా ఇంటికి చేరుకునేలా సహాయం చేయాలని కోరుతున్నాను” అని సోనాల్ చౌహాన్ పోస్ట్ చేశారు.
కేవలం సోనాల్ మాత్రమే కాకుండా, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు కూడా తన బృందంతో కలిసి దుబాయ్ ఎయిర్పోర్టులోనే ఆగిపోయారు. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ టోర్నమెంట్ కోసం బర్మింగ్హామ్ వెళ్తుండగా, దుబాయ్లో విమానాలు నిలిచిపోయాయని ఆమె తెలిపారు. ఎయిర్పోర్ట్ సమీపంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని, పరిస్థితి భయాందోళనకరంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం తమను సురక్షిత ప్రాంతానికి తరలించారని, భారత రాయబార కార్యాలయం తమతో టచ్లో ఉందని సింధు వెల్లడించారు. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో ఎయిర్ ఇండియా సహా పలు అంతర్జాతీయ సంస్థలు తమ విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశాయి.