Tamil Actor Ponnambalam | ముప్పైఏళ్ల క్రితం వచ్చిన ‘ఘరానా మొగుడు’ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చాడు తమిళ నటుడు పొన్నంబలం. ఈ సినిమాలో కనిపించి కాసేపే అయినా.. చిరుతో రింగులో చేసిన ఫైటింగ్ పొన్నంబలంకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వరుసగా తెలుగులోనూ ప్రతినాయకుడిగా ఫుల్ బిజీ అయ్యాడు. స్టంట్మెన్గా కెరీర్ ప్రారంభించిన పొన్నంబలం ‘కలియుగం’ అనే తమిళ సినిమాతో నటుడిగా మారాడు. కెరీర్ మొదట్లో ఏడాదికి పది సినిమాల్లో కనిపించిన పొన్నంబలం ఇప్పుడు కాస్త డల్ అయ్యాడు. ఇదిలా ఉంటే పొన్నంబలం తాజాగా ఓ ఇంటర్వూలో తన సొంత తమ్ముడే తనకు విషం పెట్టి చంపాలనుకున్నట్లు సంచలన విషయాలను వెల్లడించాడు.
గతకొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న పొన్నంబలం ఇటీవలే కిడ్నీ మార్పిడి చేయించుకున్నాడు. అతిగా మద్యం సేవించడం, డ్రగ్స్ వాడకం వల్లే తన కిడ్నీలు పాడైయ్యాయని గతకొలంగా ఆయనపై వస్తున్న వార్తలపై పొన్నంబలం తాజాగా స్పందించాడు. అవన్ని అవాస్తవమని తన సొంత తమ్ముడి వలే అలా అయిందని విస్తుపోని నిజాలను వెల్లడించాడు. ‘మద్యం, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల తన కిడ్నీలు విఫలమవుతున్నాయని చాలా మంది భావించారు. కానీ అలాంటిదేమీ జరగలేదన్నారు. తన తండ్రికి నలుగురు భార్యలు. మూడో భార్య కొడుకును తన సొంత తమ్ముడిగా భావించి మేనేజర్గా పెట్టుకున్నా. నా వృత్తిపరమైన విషయాలన్ని తనే చూసుకునే వాడు. అయితే ఒకసారి నేను తాగే బీరులో స్లో పాయిజన్ కలిపాడు. అంతేకాకుండా విషం కలిపిన ఆహారాన్ని పెట్టేవాడు. దాంతో కొంతకాలానికి నా కిడ్నీలు పాడైపోయాయి. ఇక అప్పుడు డాక్టర్లను సంప్రదిస్తే విష ప్రయోగం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. అయితే అతను అలా చేశాడన్న విషయం ఇటీవలే తెలిసిందని’ పొన్నంబలం చెప్పుకొచ్చాడు.
కిడ్నీలు ఫేయిల్ అవడంతో కిడ్నీ మార్పిడి చేయాలని డాక్టర్లు సూచించారని, దాంతో తన బంధువు ఒకతను కిడ్నీ దానం చేశాడని పొన్నంబలం చెప్పాడు. అయితే ఆ సమయంలో తనను ఆర్థికంగా చిరంజీవి ఆదుకున్నారని తెలిపాడు. చికిత్స కోసం కావాల్సినంత డబ్బు లేకపోవడంతో ఎవరిని అడగాలో, ఏం చేయాలో అర్థం కాని సమయంలో చిరంజీవి గారు గుర్తుకు వచ్చాడని పొన్నంబలం తెలిపాడు. ‘చిరంజీవి గారికి ఫోన్ చేసిన తన సమస్య గురించి చెప్పి, సాయం చేయమని అడిగాను. అప్పుడు చిరంజీవి గారు నేనున్నాంటూ భరోసా ఇచ్చాడు. లక్ష, రెండు లక్షలు హెల్ప్ చేస్తారని అనుకున్నాను. కానీ మరో ఐదు నిమిషాల్లో అపోలో ఆస్పత్రి నుంచి నీకు ఫోన్ వస్తుంది. రిపోర్ట్స్ తీసుకెళ్లి అడ్మిట్ అ్వవమని చెప్పాడు. ఆ హాస్పిటల్లో నన్ను ఎంట్రీ ఫీస్ కూడా అడగలేదు. మొత్తం బిల్లు 40లక్షలు అయింది. చిరంజీవి గారే అంతా చూసుకున్నారని’ చిరు చేసిన సాయాన్ని వెల్లడించాడు.
పేరుకు తమిళ నటుడే అయిన పొన్నంబలంకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. అల్లరి ప్రియుడు, మెకానిక్ అల్లుడు, హిట్లర్, నువ్వు వస్తావని, చెన్నకేశవరెడ్డి, గుడుంబాశంకర్, అన్నవరం, కొడుకు వంటి పలు సినిమాల్లో ప్రతినాయకుడిగా మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. చివరగా పొన్నంబలం బుజ్జిగాడు సినిమాలో కనిపించాడు. ఆ సినిమా తర్వాతో తెలుగులో పొన్నంబలం ఒక్క సినిమా చేయలేదు.