హీరోగా నటిస్తూనే మరోవైపు ప్రతినాయకుడిగా కూడా సత్తాచాటుతున్నారు యువ నటుడు ఆది. విలనీ పండించడంతో తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్ను సృష్టించుకున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో రామ్ కథానాయకుడిగా నటించిన ‘ది వారియర్’ చిత్రంలో ఆది..ప్రతినాయకుడు గురు పాత్రను పోషించారు. ఇటీవలే ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం ఆది పాత్రికేయులతో ముచ్చటిస్తూ పంచుకున్న విశేషాలు..
‘సరైనోడు’ ‘అజ్ఞాతవాసి’ చిత్రాల్లో విలన్గా నటించా. ఆ తర్వాత వచ్చే విలన్ క్యారెక్టర్ వాటికంటే గొప్పగా ఉండాలనుకున్నా. ‘ది వారియర్’ కథ విన్నప్పుడే పవర్ఫుల్ విలనీ కనిపించింది. దాంతో వెంటనే సినిమాకు అంగీకరించా. దర్శకుడు లింగుస్వామి విలన్ గురు పాత్రను కొత్త పంథాలో డిజైన్ చేశారు. ఆరంభం నుంచి ముగింపు వరకు గురు పాత్ర ఒకే ఇంటెన్సిటీతో సాగుతుంది. మేకప్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నా. చెవికి దిద్దు పెట్టుకోవడంతో పాటు లెన్స్ కూడా వాడాను.
హీరో అయినా, విలన్ అయినా..రెండు పాత్రలు నాకు సౌకర్యవంతంగానే అనిపిస్తాయి. కథలో కొత్తదనంతో పాటు నా పాత్ర ఛాలెంజింగ్గా అనిపించాలి. ఏ క్యారెక్టర్ చేసినా ప్రేక్షకులకు గుర్తుండిపోతే చాలనుకుంటా. జీవితం చాలా చిన్నది. మనకున్న సమయంలోనే నచ్చినవన్నీ చేసేయాలి. ఈ సినిమాలో రామ్కు, నాకు మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. ముఖ్యంగా ైక్లెమాక్స్ ఫైట్ తెరపై సీరియస్గా అనిపించినా..లొకేషన్లో మాత్రం ఓ సాంగ్ షూటింగ్లా అనిపించింది. మేమిద్దరం ఫైట్ చేస్తుంటే డ్యాన్స్ చేస్తున్నట్లుందని దర్శకుడు లింగుస్వామి చెప్పేవారు.
ప్రస్తుతం ప్రేక్షకులు భాష గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. సినిమాలోని కంటెంట్, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ఎలా ఉందనే విషయాల్నే చూస్తున్నారు. తెలుగువాళ్లు నన్ను తమిళం అబ్బాయినని అనుకుంటే, తమిళంవాళ్లేమో తెలుగువాడినని అనుకుంటున్నారు. నేను మాత్రం భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నా. కథల ఎంపికలో పూర్తి నిర్ణయం నేనే తీసుకుంటా. నాన్నగారికి కథ వినిపించి అవసరమైతే సలహాలు తీసుకుంటా. నా వైవాహికం జీవితం సంతోషంగా సాగిపోతున్నది. నా భార్య శ్రీనిధి సినిమాలు చేస్తానంటే ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రతి ఒక్కరి వ్యక్తిగత స్వేచ్ఛ, విలువల్ని గౌరవించాలన్నది నా సిద్ధాంతం. ప్రస్తుతం తెలుగులో ‘శివుడు’ పేరుతో ఓ సినిమా చేస్తున్నా.