Aadavallu Meeku Johaarlu vs Bheemla nayak | నిన్నటి వరకు ఫిబ్రవరి 25న పవన్ కళ్యాణ్ సినిమా రాదు అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆయన అనుకున్న తేదీకే భీమ్లా నాయక్ సినిమాను తీసుకొస్తున్నట్లు నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ప్రకటించాడు. దాంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో కుదుపు మొదలైంది. ఫిబ్రవరి 25న విడుదలకు ప్లాన్ చేసుకున్న సినిమాల భవిష్యత్తు సందిగ్ధంలో పడిపోయింది. ఇప్పటికే కిరణ్ అబ్బవరం తన సెబాస్టియన్ సినిమాను వాయిదా వేసుకున్నాడు. మరోవైపు వరుణ్ తేజ్ గని కూడా మరో తేదీ చూసుకుంటుంది. కానీ అదే రోజు రాబోతున్న మరో సినిమా మాత్రం ఇంకో తేదీ కోసం వెళ్లడం లేదు.
పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినా కూడా తాను కూడా పోటీలో ఉంటా అంటున్నాడు యంగ్ హీరో శర్వానంద్. ఆయన హీరోగా నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు ఫిబ్రవరి 25న విడుదల కానుంది. దీనికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. పవన్ సినిమా ప్రకటించక ముందే అంటే ఏమో అనుకోవచ్చు కానీ.. భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న వస్తుంది అని చెప్పిన తర్వాత కూడా ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్ర యూనిట్ వెనక్కి తగ్గడం లేదు. తమ సినిమా ఇప్పటికీ కూడా అనుకున్న తేదీకే వస్తుందని చెబుతున్నారు.
Completed dubbing for #AadavalluMeekuJohaarlu ❤️
See you all on 25th 💖@iamRashmika @SLVCinemasOffl pic.twitter.com/vUrsAjDUpA
— Sharwanand (@ImSharwanand) February 16, 2022
ఒకే రోజు రెండు సినిమాలు పోటీ పడడం కొత్తేం కాదు. కానీ ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాతో పోటీ పడటం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయం. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా వస్తుంది. కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. కొన్నేళ్లుగా సరైన విజయం లేని శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు పైనే ఆశలు పెట్టుకున్నాడు. అలాంటిది ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాతో పోటీ పడాల్సి వస్తుందని ఆయన అస్సలు ఊహించి ఉండడు. కానీ అదే జరుగుతోంది. ఈ విషయంలో నిర్మాతలు కూడా వెనక్కి తగ్గడం లేదు. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ పోటీ ఎలా ఉండబోతుందో చూడాలి.