అన్నను చంపించిన ఎమ్మెల్యే చావు బతుకుల్లో ఉంటే.. అతన్ని హాస్పిటల్లో చేర్చి, సేవ చేసి, బతికించి, బతుకుపై ఆశ కలిగించి, చివరకు ఎందుకు చంపుతున్నానో వివరంగా చెప్పి మరీ చంపుతాడు ‘రంగస్థలం’ సినిమాలో హీరో చిట్టిబాబు. ఎమ్మెల్యేని గప్చుప్గా చంపేసి రామలక్ష్మితో ఎస్కేప్ అవ్వడంతో ‘రంగస్థలం’ కథ అప్పటికి ముగిసింది.
మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఎమ్మెల్యేని చంపిన చిట్టిబాబు జీవితం తర్వాత ఎలాంటి మలుపులు తీసుకుంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తయారవుతోంది. అవును.. ‘రంగస్థలం’ సీక్వెల్ని సిద్ధం చేసేపనిలో నిమగ్నమయ్యారు దర్శకుడు సుకుమార్. ప్రస్తుతం రామ్చరణ్ ‘పెద్ది’ షూటింగ్లో బిజీగా ఉన్నారు.
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్నది. శిష్యుడు సినిమా పూర్తవ్వగానే.. రామ్చరణ్ గురువుగారి సినిమా మొదలుపెడతారట. అంటే చిట్టిబాబునీ, రామలక్ష్మినీ ‘రంగస్థలం’ కొనసాగింపులో మళ్లీ చూడబోతున్నామన్నమాట. ఈ వార్తే నిజమైతే, ఇంతకు మించిన శుభవార్త మెగా అభిమానులకు మరొకటుండదు.