Sovereign Gold Bond | ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర నేపథ్యంలో బంగారం ధరలు పెరుగనున్నాయి. భవిష్యత్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని బులియన్ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మీరు బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా.. అయితే సావరిన్ గోల్డ్ బాండ్లలో మదుపు చేయండి. అందుకు ప్రభుత్వం మీకు మరో అవకాశం కల్పిస్తున్నది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీం 2021-22 కింద ఫిబ్రవరి 28 నుంచి మార్చి నాలుగో తేదీ వరకు ఆ అవకాశం కల్పిస్తున్నది.
సావరిన్ గోల్డ్ బాండ్లలో ఒక గ్రామ్ బంగారం ధర రూ.5,109గా కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. డిజిటల్ చెల్లింపుల ద్వారా ఆన్లైన్లో సావరిన్ గోల్డ్ బాండ్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఒక గ్రామ్ విలువ గల బాండ్పై రూ.50 డిస్కౌంట్ కల్పిస్తున్నది. అంటే ఆన్లైన్లో అప్లయ్ చేయడంతోపాటు డిజిటల్ చెల్లింపులు జరిపితే ఒక గ్రామ్ బాండ్కు రూ.5059 చెల్లిస్తే సరిపోతుంది.
సావరిన్ గోల్డ్ బాండ్ అంటే ప్రభుత్వ బాండ్. దీన్ని ఆర్బీఐ జారీ చేస్తుంది. దీన్ని డిమ్యాట్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఐదు గ్రాముల బాండ్.. ఐదు గ్రాముల బంగారం ధరతో సమానంగా ఉంటుంది. బాండ్ కొనుగోలు కోసం సెబీ ఆథరైజ్డ్ బ్రోకర్కు డబ్బు పే చేశాక మీ పేరు మీద బాండ్ వస్తుంది. బాండ్ విక్రయించిన తర్వాత దాని మొత్తం విలువ మదుపరి ఖాతాలో జమ అవుతుంది.
ప్రతియేటా జారీ చేసే సావరిన్ గోల్డ్ బాండ్పై 2.50 శాతం వడ్డీరేటు ఖరారు చేసింది ఆర్బీఐ. ఈ వడ్డీ మొత్తం ప్రతి ఆరు నెలలకు మదుపర్ల ఖాతాలో జమ అవుతుంది. అలాగే, ఐటీ చెల్లింపుదారులు శ్లాబ్కు అనుగుణంగా టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
సావరిన్ గోల్డ్ బాండ్లలో ప్యూరిటీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రచురించిన 24 క్యారట్ల బంగారంతో గోల్డ్ బాండ్ల ధర ఖరారవుతుంది. ఎనిమిదేండ్ల తర్వాత సావరిన్ బాండ్ మెచ్యూర్ అవుతుంది. దీనిపై వచ్చే లాభాలపై పన్ను ఉండదు. ఐదేండ్ల తర్వాత ఈ బాండ్ మనీ విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే, దీర్ఘకాలిక పెట్టుబడి లాభం (ఎల్టీసీజీ) కింద 20.80 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడులకు ఆర్బీఐ పలు ఆప్షన్లు ఇచ్చింది. బ్యాంకు శాఖలు, పోస్టాఫీసులు, స్టాక్ ఎక్స్చేంజ్లు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్హెచ్సీఐఎల్) ద్వారా మదుపు చేయొచ్చు. అప్లికేషన్ ఫామ్ నింపి సమర్పించిన తర్వాత మీ బ్యాంకు ఖాతా నుంచి బాండ్లకు నగదు పేమెంట్ అవుతుంది. తదుపరి మీ డీమ్యాట్ ఖాతాకు బాండ్లు బదిలీ చేస్తారు. సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడుల మదుపుకు పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే.