Yes Bank | ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ `యెస్ బ్యాంక్` రూ.8,898 కోట్ల నిధుల సేకరణ కోసం గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లు కార్ల్యేల్ గ్రూప్, అడ్వెంట్ ఇంటర్నేషనల్ సంస్థలకు 10 శాతం వాటాలను విక్రయించనున్నది. ఇందుకోసం `యెస్ బ్యాంక్` డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. రూ.5100 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు, రూ.3800 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ వారంట్లను కార్ల్యేల్, అడ్వెంట్ అనుబంధ సీఏ బాస్క్యూ ఇన్వెస్ట్మెంట్స్, వెర్న్వెంటా హోల్డింగ్స్కు జారీ చేయనున్నది. రూ.369.61 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు, రూ.256.75 కోట్ల విలువైన వారంట్లను జారీ చేయనున్నది. మొత్తం రూ.8,898. 47 కోట్ల నిధుల సేకరణకు ప్రిఫరెన్షియల్ బేసిస్ ప్రకారం ఈ సెక్యూరిటీలను జారీ చేయనున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్లో యెస్ బ్యాంక్ తెలిపింది.
ఒక్కో షేర్ రూ.13.78, ఈక్విటీ షేర్లుగా మార్చే వారంట్లను రూ.14.82ల చొప్పున యెస్ బ్యాంక్ విక్రయిస్తుంది. వీటి ఫేస్ విలువ రూ.2గా ఉంటుంది. దీనికి ప్రతిగా కార్ల్యేల్ గ్రూప్ అనుబంధ సీఏ బాస్క్యూ ఇన్వెస్ట్మెంట్స్, అడ్వెంట్స్ అనుబంధ వెర్వెంటా హోల్డింగ్స్ ఒక్కో షేర్ విలువ రూ.13.78 చొప్పున 184.80 కోట్ల షేర్లను యెస్ బ్యాంక్కు ఆఫర్ చేస్తాయి. యెస్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు తీసుకున్న నిర్ణయంపై వచ్చే నెల 24న వాటాదారుల సమావేశంలో ఆమోదం లభించడంతోపాటు దానికి రెగ్యులేటరీ అనుమతులు మంజూరు కావాల్సి ఉంటుంది.