WPI inflation |హోల్సేల్ ద్రవ్యోల్బణం మళ్లీ డబుల్ డిజిట్స్ దాటింది. గత నెల టోకు ద్రవ్యోల్బణం 15.08 శాతానికి చేరుకున్నది. నిత్యావసరాల ధరలు, కూరగాయల ధరలు పెరిగిపోవడంతో టోకు ద్రవ్యోల్బణ సూచీ పైపైకి దూసుకెళ్లింది. గత మార్చిలో హోల్సేల్ ద్రవ్యోల్బణం 14.55 శాతం కాగా, గతేడాది ఏప్రిల్లో 10.74 శాతంగా నమోదైంది. వరుసగా 13 నెలలుగా టోకు ద్రవ్యోల్బణం డబుల్ డిజిట్స్ నమోదు చేయడం ఆందోళనకర పరిణామం అని చెబుతున్నారు.
కూరగాయల ద్రవ్యోల్బణం 23.24 శాతానికి చేరుకోవడంతోపాటు ఆహార ద్రవ్యోల్బణం 8.35 శాతంగా నమోదు కావడానికి కారణమైంది. ఇంధన ద్రవ్యోల్బణం 38.66 శాతానికి పెరిగిపోగా, తయారీ వస్తువుల ధరలు 10.85 శాతం పెరిగాయి. రిటైల్ ద్రవ్యోల్బణంతోపాటు టోకు ధరల ద్రవ్యోల్బణం పెరగడంతో మరోదఫా ఆర్బీఐ కీలక వడ్డీరేట్లు పెంచక తప్పకపోవచ్చు.
గతవారం జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన రిటైల్ ద్రవ్యోల్బణం 7.8 శాతం (95 నెలల గరిష్ఠ స్థాయి)గా నమోదైందని తెలిసింది. ఇప్పటికే 40 బేసిక్ పాయింట్లు రెపోరేట్ పెంచిన ఆర్బీఐ.. మరో దఫా పెంచడానికి మార్గం సుగమమైంది. జూన్లో జరిగే ద్రవ్య పరపతి సమీక్షలో మరోసారి కీలక వడ్డీరేట్లు పెంచుతుందని భావిస్తున్నారు.
గత నెలలో ఆహార ద్రవ్యోల్బణం 8.38 శాతం. వంట నూనెలు 17.3 శాతం, కూరగాయల ధరలు 15.4 శాతం పెరిగాయి. మార్చిలో స్వల్పంగా ముడి చమురు ధరలు తగ్గినా, ఏప్రిల్లో పెట్రోల్, డీజిల్, కుకింగ్ గ్యాస్ ధరలు పైపైకి దూసుకెళ్లడంతో గత నెలలో ఇంధన ద్రవ్యోల్బణం డబుల్ డిజిట్ మార్క్ (10.8 శాతం) దాటింది.