ఇదే ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కారు. 1955 మెర్సిడెస్ బెంజ్ 300 ఎస్ఎల్ఆర్ అలెన్హట్ కూపే ఇది. ఏకంగా రూ.1,100 కోట్లకు (143 మిలియన్ డాలర్లు) అమ్ముడైంది. ఈ నెల 5న జర్మనీలోని స్టట్గార్ట్లోగల మెర్సిడెస్ బెంజ్ మ్యూజియం వద్ద జరిగిన ఓ రహస్య వేలంలో ఈ రికార్డు ధర పలికింది. దీంతో 2018లో 1962 ఫెరారీ 250 జీటీవో పేరిట నమోదైన 48.4 మిలియన్ డాలర్ల రికార్డు ధర కనుమరుగైపోయింది.
కాగా, యజమాని తరఫున బ్రిటీష్ కార్ కలెక్టర్ సైమన్ కిడ్సన్ ఈ కూపే కారును అందుకున్నారని మెర్సిడెస్ బెంజ్ చైర్మన్ ఓలా కల్లేనియస్ తెలిపారు. 1955 నాటి ఈ రకం కార్లు రెండే ఉన్నాయి. అందులో ఒకటే ఇది. రెండోది మ్యూజియంలోనే ప్రజల సందర్శనార్థం ఉంటుందని ఓలా చెప్పారు. మెర్సిడెస్ బెంజ్ రేసింగ్ డిపార్ట్మెంట్ వీటిని తయారు చేసింది. ఈ కార్ల సృష్టికర్త, చీఫ్ ఇంజినీర్ రుడాల్ఫ్ అలెన్హట్. ఈయన్ని గుర్తుచేసే విధంగానే ఈ కారు పేరునూ పెట్టారు.