హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ): ఆఫీస్ అడ్డాగా హైదరాబాద్ మారిపోతున్నది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాలను ఇక్కడ విస్తరిస్తుండగా…తాజాగా ఈ జాబితాలోకి అమెరికాకు చెందిన టెక్నాలజీ సంస్థ హై రేడియస్ కూడా చేరింది. ఇప్పటికే గచ్చిబౌలిలోని డీఎల్ఎఫ్ సైబర్ సిటీలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన సంస్థ..తాజాగా మరో ఆఫీస్ను ఏర్పాటు చేయడానికి పెద్ద మొత్తంలో ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకున్నది.
ఐటీ కారిడార్లోని రహేజా మైండ్ స్పేస్ సెజ్లో ఒకేసారి 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన కార్యాలయ ప్రాంగణాన్ని ఇటీవల లీజుకు తీసుకొని కార్యకలాపాలు ప్రారంభించింది. ఇలా ఒకే కంపెనీ ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో ఆఫీస్ స్థలాన్ని తీసుకోవడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారని ఐటీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఆర్థిక సేవల రంగంపై మరింత దృష్టి సారించేందుకుగాను సంస్థ ఈ నూతన కార్యాలయాన్ని లీజుకు తీసుకున్నది.