India as Aviation Hub | ఇక ముందు ఏవియేషన్ రంగ హబ్గా భారత్ నిలువనున్నది. సాక్షాత్ కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గురువారం ఈ సంగతి చెప్పారు. సమీప భవిష్యత్లో విదేశాల్లోని సుదూర ప్రాంతాలకు భారత వైమానిక సంస్థలు ఇంటర్నేషనల్ ఫ్లయిట్స్ నడుపాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటున్నదని చెప్పారు. సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన ఓ సదస్సులో సింధియా మాట్లాడుతూ.. భారతీయుల కోసం భారత్ను (ఏవియేషన్) హబ్గా తీర్చిదిద్దాలని నేను కోరుకుంటున్నా.. భారత్ ఆవల ఏవియేషన్ హబ్స్ ఉండాలని కోరుకోవడం లేదు అని చెప్పారు.
మిడిల్ఈస్ట్, ఆగ్నేయాసియాల్లో ఏర్పాటైన హబ్ల ద్వారా సేవలందిస్తున్న విదేశీ విమానయాన సంస్థల విమానాల్లోనే యూరప్, అమెరికాలకు భారీ సంఖ్యలో విదేశీయులు ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ సర్కార్.. భారత్ను ఏవియేషన్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది.
పలు దేశాలకు విదేశీ విమాన సర్వీసుల్లో విదేశీయులు ప్రయాణించడానికి అనుమతిపై పరిమితులు విధించింది. ఇప్పుడు ఉన్న పరిమితిపై ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. అయితే ఇది ఆచరణలో కష్టం కావచ్చునని అంటున్నారు. ప్రస్తుతం పలు దేశాలతో విమాన సర్వీసుల నిర్వహణకు ఒప్పందాలు చేసుకున్నది. కానీ, ఆయా దేశాల విమానాలు దుబాయి లేదా ఇతర హబ్ నుంచి ఢిల్లీ మీదుగా లండన్కు ప్యాసింజర్ల ప్రయాణానికి అనుమతిపై నిషేధం విధించింది.
ఇంటర్నేషనల్ విమాన సర్వీసుల పునఃప్రారంభం విషయమై పలు మంత్రిత్వశాఖలతో సంప్రదిస్తున్నట్లు కేంద్ర మంత్రి సింధియా చెప్పారు. సురక్షితమైన వాతావరణంలో మాత్రమే విదేశీ విమాన సర్వీసుల పునఃప్రారంభానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కరోనా నేపథ్యంలో గతేడాది మార్చి నుంచి ఇంటర్నేషనల్ విమాన సర్వీసులపై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.