Mobiles Prepaid Charges | మొబైల్ ఫోన్స్ వచ్చిన ప్రారంభంలో ఇతరులకు ఫోన్ చేయాలంటే ఆలోచించాల్సిందే. ఔట్ గోయింగ్ కాల్స్కు నిమిషాలు లెక్కపెట్టుకునే వారం. టెలికం రంగంలో రిలయన్స్ జియో అడుగు పెట్టాక చాలా మొబైల్ ఫోన్ చార్జీలు చౌకగా మారాయి. ఇక ముందు ఫోన్ కాల్ చేయాలంటే భయపడే రోజులు వచ్చేశాయి. జియో వచ్చాక ప్రతి నెలా నిర్దిష్ట మొత్తం చెల్లించి ఎంత డేటా అయినా వాడుకునే వెసులుబాటు వచ్చింది. దీంతో మిగతా టెలికం కంపెనీలు దిగొచ్చి జియోను అనుసరిస్తూ చార్జీల భారం తగ్గించాయి. టెలికం సంస్థలన్నీ ఒక రూట్లోకి వచ్చాక చార్జీలు పెంచడం ప్రారంభించాయి. తాజాగా సోమవారం ఎయిర్టెల్ తన ప్రిపెయిడ్ ఖాతాదారులకు భారీ షాక్ ఇచ్చింది. భారీగా టారిఫ్లు పెంచేసింది. కనిష్టంగా రూ.20 నుంచి గరిష్ఠంగా రూ.501 వరకు పెంచివేసింది.
ఈ షాక్ నుంచి మొబైల్ ఫోన్ యూజర్లు తేరుకునే లోపే మరో సంస్థ వొడాఫోన్ ఐడియా ఇటువంటి ప్రకటనే చేసింది. ఇప్పటికే బోల్డు నష్టాల్లో కూరుకుని ఇబ్బందులు పడుతున్న వొడాఫోన్ ఐడియా చేసిన ప్రకటన యూజర్లలో గుబులు పుట్టిస్తోంది. అన్ని కాలింగ్, డేటా టారిఫ్లు 20-25 శాతం పెంచుతున్నట్లు తెలిపింది. గురువారం (నవంబర్ 25) నుంచి అమలులోకి తెచ్చింది. వొడాఫోన్ ఐడియా కనీస ప్రీపెయిడ్ రీచార్జ్ ప్యాక్ ధర 25.31 శాతం పెంచింది. ప్రస్తుతం రూ. 79గా ఉన్న ఈ ప్యాక్ ఇకపై రూ. 99కు అందుబాటులో ఉంటుంది. అన్లిమిటెడ్ క్యాటగిరీ ప్లాన్లపై 20 నుంచి 23 శాతం వరకు చార్జీలు పెంచివేసింది.
ప్రస్తుతం రూ.219గా ఉన్న అతి తక్కువ బండిల్డ్ ప్లాన్ రూ.269కి పెంచింది. ఇది 28 రోజుల కాల పరిమితితో రోజూ ఒక జీబీ డేటా అందిస్తుంది. రోజూ 1.5 జీబీ డేటాతో 84 రోజుల ప్లాన్ చార్జి రూ.599 నుంచి రూ.719కి పెంచేసింది. ఏడాది కాలపరిమితి గల 1.5 జీబీ డేటా ప్లాన్ ధర రూ.20.8 శాతం పెంచి రూ.2,899గా ఖరారు చేసింది. ఇక వాల్యూ టాపప్ ప్యాక్ చార్జీలు కూడా 20 శాతం ఎక్కువ చేసింది. త్వరలోనే జియో కూడా టారిఫ్ చార్జీలను పెంచే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులంటున్నారు.