Market Capitalisation | గతవారం దాదాపు టాప్-10 సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ హరించుకుపోయింది. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) భారీగా నష్టపోగా మొత్తం టాప్ స్క్రిప్ట్లు రూ.2.29 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్టపోయాయి. గత వారం అంతా దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడటంతో ఈక్విటీలు ఒత్తిడికి గురయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్తోపాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి మార్గాల వైపు మళ్లారు.
దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ 1465.79 పాయింట్లు (2.63 శాతం), నేషనల్ స్టాక్ ఎక్చ్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 382.50 (2.31 శాతం) పాయింట్ల పతనంతో ముగిశాయి. ఎల్ఐసీ ఎం-క్యాప్ రూ.57,272.85 కోట్లు నష్టంతో రూ.4,48,885.09 కోట్ల వద్ద ముగిసింది. కార్పొరేట్ మేజర్ రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.44,311.19 కోట్ల పతనంతో రూ.18,36,039.28 కోట్ల వద్ద స్థిర పడింది.
ఐటీ దిగ్గజాల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్ రూ.45,746.13 కోట్లు నష్టపోగా, టీసీఎస్ ఎం-క్యాప్ రూ.12,31,398.85 కోట్లు, ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,21,502.63 కోట్ల వద్ద నిలిచింది. దేశంలోని అతిపెద్ద బ్యాంకులు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ కలిసి రూ.34,970.26 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్టపోయాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16,433.92 కోట్లు పతనమై రూ.7,49,880.79 కోట్ల వద్ద ముగిసింది. ఎస్బీఐ ఎం-క్యాప్ రూ.2,231.15 కోట్ల నష్టంతో రూ.4,12,138.56 కోట్లకు చేరుకున్నది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16,305.19 కోట్లు కోల్పోయి రూ.5,00,744.27 కోట్ల వద్ద నిలిచింది.
హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.21,674.98 కోట్లు కోల్పోయి రూ.5,16,886.58 కోట్ల వద్ద స్థిర పడింది. మార్టగేజ్ లెండర్ హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ రూ.17,879.22 కోట్లు నష్టపోయి రూ.3,95,420.14 కోట్లకు చేరుకున్నది. టెలికం మేజర్ భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,359.31 కోట్లు నష్టపోయి రూ. 3,69,613.44 కోట్ల వద్ద ముగిసింది.