Buget 2023-24 | వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24) బడ్జెట్ ప్రవేశపెట్టే గడువు దగ్గర పడుతున్నది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ వర్గాల ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే.. మరోవైపు బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు ముమ్మరం చేశారు. గతేడాది పూర్తిగా ఉద్యోగుల జీవితం కష్టాల కడలిలోనే సాగింది. కరోనా భయం తగ్గడంతో కార్పొరేట్ కంపెనీలు తమ సిబ్బందికి వర్క్ ఫ్రం హోం ఎత్తివేయడం, ఆర్థిక మాంద్యం ముప్పు ముంచుకొస్తున్న వేళ.. ఐటీ దిగ్గజాలు మొదలు వివిధ పరిశ్రమలు భారీగా ఉద్యోగులకు ఉద్వాసనలు పలుకుతున్న తీరు, ఉక్రెయిన్-రష్యా యుద్దం ప్రభావంతో భారీగా పెరిగిన నిత్యావసర ధరలతో వేతన జీవులు ఆందోళనకు గురయ్యారు.
ఆర్థిక మాంద్యం ముప్పు, అధిక ధరలు, ఉద్యోగుల తొలగింపు వంటి సమస్యలు వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ తరుణంలో ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదించనున్నారు. అయితే, నిర్మలా సీతారామన్ తన బడ్జెట్లో వేతన జీవులకు ఉపశమనం కల్పిస్తారా? లేదా? అన్న సంగతి తేలాలంటే మరో ఐదు రోజులు వేచి చూడాల్సిందే.
ఆర్థిక మాంద్యం ముప్పు భయంతో కార్పొరేట్ సంస్థలు భారీగా ఉద్యోగులను ఇండ్లకు పంపేస్తున్నాయి. క్యాంపస్, ఫ్రెషర్స్ నియామకాలనూ నిలిపేస్తున్నాయి. మరోవైపు నిత్యావసర ధరలు ప్రతి ఒక్కరినీ కలవర పెడుతున్నాయి. దీనికి తోడు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న వేళ.. ఉపాధి కల్పనకు కేంద్రం బడ్జెట్లో చర్యలు తీసుకుంటుందా? అని నిరుద్యోగ యువత, నిపుణులు ఎదురు చూస్తున్నారు. గ్రోత్ను ప్రోత్సహించేలా మూలధన పెట్టుబడి వ్యయం పెంచడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించే అంశాన్ని పరిగణనలోకి తీూసుకోవాలి. రూరల్, ద్వితీయ శ్రేణి, త్రుతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లో ఉపాధి అవకాశాల కల్పించేలా మౌలిక వసతుల కల్పనకు పెట్టుబడులు పెంచే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
ఆదాయం పన్ను చట్టంలోని 80జేజేఏఏ సెక్షన్ ప్రకారం అదనంగా నియమించుకున్న ఉద్యోగుల ఖర్చు మీద పన్ను మినహాయింపు పొందడానికి కార్పొరేట్ సంస్థలకు చాన్స్ ఉంది. ఇందులో గల పరిమితులు తొలగించి మరింత మందికి ఉపాధి కల్పించేలా కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహించాలి. స్టార్టప్ సంస్థలకు మరింత ప్రోత్సాహాలు కల్పించి ఉద్యోగాలు కల్పించేలా చర్యలు చేపట్టవచ్చు.
కార్పొరేట్ సంస్థలు అర్ధంతరంగా ఉద్యోగుల తొలగింపు, మూన్ లైటింగ్, ఉద్యోగుల క్వైట్ క్విట్టింగ్ ఇటీవల సర్వ సాధారణమైంది. దీంతో వర్క్ ప్లేసెస్లో పాలసీలు కఠినతరం చేయాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వర్క్ ఫ్రం హోం చేసే ఉద్యోగులకు స్పెషల్ అలవెన్స్ ఇవ్వాలన్న డిమాండ్ కూడా వస్తున్నది. ఐటీ సంస్థల ఉద్యోగులు మూన్ లైటింగ్కు పాల్పడుతున్న వేళ.. అలా వచ్చే ఆదాయానికి పన్ను వర్తింపచేయడం ఎలా అన్న విషయమై క్లారిటీ ఇవ్వాలి. ఇక కార్పొరేట్ సంస్థలు అర్ధంతరంగా ఉద్యోగులను తొలగించకుండా, వారికి సామాజిక భద్రత కల్పించేలా ఆయా సంస్థలకు సర్కార్ దిశా నిర్దేశం చేయాల్సి ఉంటుంది.
తక్కువ పెట్టుబడితో నడిచే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లే దేశంలో ఉపాధి కల్పనలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. దేశీయ జీడీపీలో మూడో వంతు వాటా ఎంఎస్ఎంఈలదే. వీటిల్లో 2021-22లో 93.94 లఓల మంది పని చేస్తున్నారు. వీరిలో అత్యధికులు అసంఘటిత రంగ కార్మికులే. కనుక వీరికి ఎన్పీఎస్ వంటి పెన్షన్ పథకాలతోపాటు ఈఎస్ఐ, ఈపీఎఫ్ఓ వంటి సొషల్ సెక్యూరిటీ వ్యవస్థలు అందుబాటులోకి తేవాలి. మరింత మందికి ఉపాధి కల్పించేలా ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు పెంచాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. మనదేశంలో నిరుద్యోగ సమస్యకు నైపుణ్య లేమి ఒక కారణం. చిన్న ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు నైపుణ్యం పెంచుకోవడానికి సర్కార్ ప్రోత్సాహాలు అందించాలి.
ఆదాయం పన్ను చెల్లింపుల్లో వేతన జీవుల వాటా ప్రధానం. 2022లో ఐటీఆర్ సబ్మిట్ చేసిన వారిలో 50 శాతం మంది ఉద్యోగులే. కనుక కనీస పన్ను మినహయింపు లిమిట్ రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని వేతన జీవులు సుదీర్ఘకాలంగా కోరుతున్నారు. దీనివల్ల చిరుద్యోగులుగా ఉన్నవారి కొనుగోలు సామర్థ్యం పెరుగుతుంది. పరోక్ష పన్నుల వల్ల కూడా ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువవుతుంది. ఇంటి రుణాలపై పన్ను మినహాయింపు లిమిట్ పెంచితే ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద పన్ను విషయమై కూడా యూనిఫామ్ పాలసీ తేవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఉద్యోగులు పొదుపు పెరిగి పెట్టుబడులు పెరిగే అవకాశాలు ఉన్నాయి.