హైదరాబాద్, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ): ఇండియా సెమీకండక్టర్ల పరిశ్రమలలో స్వావలంబన సాధించేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీ కండక్టర్ మిషన్(ఐఎస్ఎం 2.0) కింద రూ.1.000 కోట్ల నిధులు కేటాయించింది. అంతేకాదు, సెమీకండక్టర్ అండ్ డిస్ ప్లే తయారీ అభివృద్ధి సవరించిన పథకానికి(మాడిఫైడ్ ప్రోగ్రామ్) మొత్తం రూ.8,000 కోట్లు కేటాయించారు. ఐఎస్ఎం 2.0 దేశాన్ని సెమీకండక్టర్ డిజైన్-తయారీ, ఆవిషరణలలో ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టే దిశగా కీలక అడుగని ప్రకటించింది. దేశీయ సామర్థ్యాలను విస్తరించి, విదేశీ ఆధారితత్వాన్ని తగ్గించడంతోపాటు భారత్ను ఒక విశ్వసనీయ గ్లోబల్ సెమీకండక్టర్ హబ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్రం.. పరిశోధన, శిక్షణ కేంద్రాల ఏర్పాటు ద్వారా సాంకేతిక అభివృద్ధి, భవిష్యత్కు సిద్ధమైన నైపుణ్యాలను పెంపొందించాలని నిర్ణయించింది.
ఇందుకోసం ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ వంటి రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంలో సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు అవకాశాలున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం సహకరించడంలేదు. రాష్ర్టానికి సెమీకండక్టర్ల ప్రాజెక్టును మంజూరు చేయాలని పలుమార్లు కోరినప్పటికీ పెడచెవిన పెట్టింది. ఐఎస్ఎం 1.0కు కొనసాగింపుగా కేంద్రం ఐఎస్ఎం 2.0ను ప్రకటించిన విషయం విదితమే. ఆధునిక డిజిటల్, పారిశ్రామిక వ్యవస్థలన్నింటికీ సెమీకండక్టర్ చిప్లు మూలస్తంభాలుగా మారుతున్న ప్రస్తుత తరుణంలో దేశీయ సెమీకండక్టర్ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు కేంద్రం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నది.
ఐఎస్ఎం 2.0 కింద భారత్లోనే సెమీకండక్టర్ పరికరాల తయారీ, పూర్తి స్థాయి భారతీయ సెమీకండక్టర్ మేధస్సు హకుల(ఐపీ) రూపకల్పన, అలాగే దేశీయ-అంతర్జాతీయ సైప్లె చెయిన్ను బలోపేతం చేయడంపై దృష్టి సారించనుంది. కంప్యూటర్లు, మొబైల్ పరికరాలు, టెలికమ్యూనికేషన్, ఆటోమొబైల్స్, రక్షణ వ్యవస్థలు, కృత్రిమ మేధస్సు వంటి అనేక రంగాలకు ఇవే ప్రాణాధారంగా నిలుస్తున్నాయి. డిజైన్ సామర్థ్యాల విస్తరణ, ఫ్యాబ్రికేషన్, అసెంబ్లింగ్, టెస్టింగ్, మౌలిక సదుపాయాల అభివృద్ధి ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.
భారత్ క్రమంగా ప్రపంచ సెమీకండక్టర్ హబ్గా ఎదుగుతున్నది. పరిశ్రమ అంచనాల ప్రకారం, సెమీకండక్టర్ మారెట్ పరిమాణం 2023లో సుమారు 38 బిలియన్ డాలర్లు కాగా, 2024-25లో 50 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. 2030 నాటికి ఇది 100-110 బిలియన్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా. దేశీయ చిప్ల తయారీని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఐఎస్ఎం 1.0 కింద రూ.76,000 కోట్ల ప్రోత్సాహక ప్యాకేజీతో సిలికాన్ ఫ్యాబ్స్, కంపౌండ్ సెమీకండక్టర్లు, అసెంబ్లింగ్-టెస్టింగ్ యూనిట్లు, చిప్ డిజైన్కు 50 శాతం వరకు ఆర్థిక మద్దతు అందిస్తున్నారు. డిసెంబర్ 2025 నాటికి 6 రాష్ట్రాల్లో మొత్తం రూ.1.60 లక్షల కోట్ల పెట్టుబడితో 10 ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. వీటిలో సిలికాన్ ఫ్యాబ్ యూనిట్లు, సిలికాన్ కార్బైడ్ ఫ్యాబ్స్, అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్, ప్రత్యేక అసెంబ్లీ-టెస్టింగ్ మౌలిక సదుపాయాలు ఉన్నాయి. 2029 నాటికి దేశీయ అవసరాల్లో 70-75 శాతం చిప్లను ఇక్కడే తయారు చేయాలనే సంకల్పంతో కేంద్రం ఉన్నది.
ప్రపంచ పోటీ తీవ్రతరం కావడం, కొద్ది దేశాల వద్దే అధునాతన చిప్ టెక్నాలజీలు కేంద్రీకృతమైన నేపథ్యంలో భారత్ సెమీకండక్టర్ తయారీపై ప్రత్యేక దృష్టి సారించింది. 2026-27లో రూ.4,000 కోట్ల పెట్టుబడితో ఒక సెమీకండక్టర్ ఫ్యాబ్ యూనిట్ను నెలకొల్పాలని, ఇందులో 1,500 మందికి ఉపాధి కల్పించడంతోపాటు రూ.11,000 కోట్లతో 3 వేల ఉద్యోగాల సామర్థ్యం కలిగిన 9 కాంపౌండ్ సెమీకండక్టర్/ఏటీఎంపీ/ఓఎస్ఏటీ యూనిట్లు ఏర్పాటు చేయాలని, అలాగే 10 సెమీకండక్టర్ ఐపీ కోర్ యూనిట్లు ఏర్పాటుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆర్థిక వ్యవస్థలు సజావుగా సాగాలంటే సెమీకండక్టర్లు అత్యంత కీలకం. ప్రపంచవ్యాప్తంగా 169 దేశాలు చిప్ కొరతను ఎదుర్కొంటుండగా, ప్రస్తుతం తైవాన్, దక్షిణ కొరియా, జపాన్, చైనా, అమెరికా వంటి కొద్ది దేశాల వద్దే అధునాతన చిప్ తయారీ పరిశ్రమ కేంద్రీకృతమై ఉంది. తైవాన్ ఒంటరిగా ప్రపంచ సెమీకండక్టర్లలో 60 శాతం, అత్యాధునిక చిప్లలో 90 శాతం ఉత్పత్తి చేస్తున్నది.
ఎలక్ట్రానిక్స్, రక్షణ, ఆటోమొబైల్ వంటి అనేక పరిశ్రమలకు కేంద్ర బిందువుగా ఉన్న తెలంగాణ రాష్ర్టానికి సెమీకండక్టర్ ప్రాజెక్టును మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎంతోకాలంగా కోరుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేన్స్ సెమికాన్ కంపెనీ తెలంగాణలో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చినప్పటికీ, రాష్ట్రంలో ప్రభు త్వం మారిన తరువాత అది గుజరాత్కు తరలివెళ్లింది. తెలంగాణ రాష్ట్రం ఆఫర్ చేసినదానికంటే గుజరాత్ ఎన్నో రెట్లు ఎక్కువ ప్రోత్సాహకాలు ఇవ్వడంతో సదరు కంపెనీ అక్కడికి తరలివెళ్లినట్లు అనంతరం ప్రభుత్వం ప్రకటించింది.
తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం ప్రత్యేకంగా సెమీకండక్టర్ ప్రాజెక్టును మంజూరుచేసి తగినన్ని నిధులు కేటాయిస్తే ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు ఆస్కారం కలుగుతుంది. ఎస్ఐఎం 2.0 కింద పలు సెమీకండక్టర్ కంపెనీలకు ప్రోత్సాహం కల్పించాలని నిర్ణయించిన కేంద్ర సర్కార్, అందులో తెలంగాణకు ప్రత్యేకంగా ఓ ప్రాజెక్టును మంజూరు చేయకపోవడం ఇక్కడి పరిశ్రమ వర్గాలను నిరాశకు గురిచేసింది.