అమెరికా బ్యాంకింగ్ సంక్షోభం నేపథ్యంలో దేశీయంగా వ్యక్తమవుతున్న ఆందోళనల మధ్య భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థకు ఢోకా లేదని, స్థితిస్థాపకతను కలిగి ఉందని ఆర్బీఐ ప్రకటించింది. అయినప్పటికీ కుప్పకూలిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్తో ఏర్పడిన భయాలు.. చాలామంది భారతీయులను ఇంకా వీడటం లేదు. యూఎస్లోని భారతీయ స్టార్టప్ల్లో చాలావరకు ఎస్వీబీలో డిపాజిట్లు చేశాయి. కానీ ఆ బ్యాంక్ చేతులెత్తేయడంతో డిపాజిటర్లు రిస్కులో పడ్డారు. ఈ క్రమం లో దేశీయ డిపాజిటర్లు, మదుపరులకు నిపుణులు కొన్ని సలహాలు, సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా నాలుగు అంశాలను మరువద్దు అని హెచ్చరిస్తున్నారు.
పక్కా ప్రణాళికతో..
మార్కెట్ల తీరుతో సంబంధం లేకుండా మదుపరులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. మీ రిస్క్నుబట్టి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమమని సలహా ఇస్తున్నారు. ఒకవేళ స్టాక్ మార్కెట్లలో 80 శాతం, డెట్ మార్కెట్లలో 20 శాతం పెట్టుబడులకు మీరు సిద్ధపడితే మార్కెట్లు బాగున్నప్పుడు మంచి లాభాలనే అందుకోవచ్చంటున్నారు. అయితే మదుపరులు తమ పోర్ట్ఫోలియోలను తప్పక సమీక్షిస్తూ ఉండాలని ఫైనాన్షియల్ ప్లానింగ్ సంస్థ ఇన్వెస్టోగ్రఫీ వ్యవస్థాపకురాలు శ్వేతాజైన్ తెలిపారు. మీ వ్యూహాలతో మీరు ముందుకెళ్లాలని సెబీ రిజిస్టర్డ్ సలహాదారు విశాల్ ధావన్ చెప్పారు. ఫిక్స్డ్ ఇన్కమ్ ఆకర్షణీయంగా అనిపిస్తే.. మదుపరులు ఆవైపూ వెళ్లవచ్చన్నారు.
రూ.5 లక్షలకుపైగా పెట్టొద్దు
ఆకర్షణీయమైన వడ్డీరేట్లను చూసి ఎడాపెడా డిపాజిట్లు చేయరాదని ఇన్వెస్ట్ ఆజ్ ఫర్ కల్ వ్యవస్థాపకులు అనంత్ లద్ధా సూచించారు. చిన్న బ్యాంకుల్లో రూ.5 లక్షలకు మించి డిపాజిట్లు చేయవద్దని సలహా ఇచ్చా రు. బ్యాంక్ ఇబ్బందుల్లో పడితే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ కింద రూ.5 లక్షలకు మించి కవరేజీ కాబోదని గుర్తుచేశారు.
డెట్ ఫండ్స్పై లుక్కేయండి..
ప్రస్తుతం డెట్ ఫండ్స్ ఆకట్టుకునే రీతిలో రాబడులను అందిస్తున్నాయి. పైగా పన్ను ఆదా అయ్యేలా ప్రతిఫలాలను ఇస్తున్నాయి. కాబట్టి మదుపరులు తమ పెట్టుబడుల వర్గీకరణలో డెట్ ఫండ్స్కు కూడా తగినంత ప్రాధాన్యత ఇవ్వడం మంచిదేనని అనంత్ లద్ధా సలహా ఇస్తున్నారు. దీనివల్ల మీ పోర్ట్ఫోలియోకు స్థిరత్వం కూడా చేకూరుతుందని చెప్తున్నారు. సంప్రదాయక పెట్టుబడిదారులకు ఇప్పుడు దీర్ఘకాలిక డెట్ మ్యూచువల్ ఫండ్స్ అనువుగా ఉంటున్నాయన్నారు. 3-4 ఏండ్లకు మించి నిరీక్షించే మదుపరులకు ఈ పెట్టుబడులు ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఆకర్షణీయ రాబడులనే ఇస్తాయన్నారు. కాగా, స్వల్పకాలిక లక్ష్యాల కోసం షార్ట్-టర్మ్ డెట్ ప్రొడక్ట్స్ ఉత్తమమని సహజ్మనీ వ్యవస్థాకుడు అభిషేక్ అభిప్రాయపడ్డారు.
సిప్ల ద్వారా పెట్టుబడులు
మదుపరులు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల (సిప్)ను తప్పక కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్లు ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు మదుపరులకు ఇవి లాభిస్తాయని అనంత్ లద్ధా అంటున్నారు. ఈక్విటీ లు నష్టాల్లో ఉన్నప్పుడు సిప్ల నుంచి వైదొలగడం అన్నది మంచి ఆలోచన కాదన్నారు.