న్యూఢిల్లీ, మార్చి 31: విదేశీ వాణిజ్య విధానం (ఎఫ్టీపీ) 2023ని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ దీన్ని ఆవిష్కరించారు. ఇందులో 2030 నాటికి దేశ ఎగుమతులు ఏటా దాదాపు రూ.165 లక్షల కోట్ల (2 ట్రిలియన్ డాలర్లు)ను తాకాలన్నది లక్ష్యంగా పెట్టారు. ఇక తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం (2022-23)లో దేశ వస్తు, సేవల ఎగుమతుల విలువ 765 బిలియన్ డాలర్లను దాటే వీలుందన్న అంచనాను డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) సంతోష్ సారంగి ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2021-22) 676 బిలియన్ డాలర్లుగా ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఈసారి ఎఫ్టీపీకి ఎటువంటి గడువూ లేదు. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇకపై విదేశీ వాణిజ్య విధానంలో మార్పులు చేస్తూ పోతామని సారంగి విలేకరులకు తెలిపారు. గతంలో ఐదేండ్లకుగాను ఎఫ్టీపీలను ప్రకటించిన సంగతి విదితమే.
డాలర్ల కొరతతో కరెన్సీ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆయా దేశాలతో రూపాయి (భారతీయ కరెన్సీ)ల్లో వాణిజ్య లావాదేవీలను నిర్వహించేందుకు భారత్ సిద్ధంగా ఉందని వాణిజ్య కార్యదర్శి సునీల్ భర్తాల్ తెలిపారు. ఈ క్రమంలోనే రుపీ చెల్లింపుల వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టామన్నారు. ఈ మేరకు కొత్త విదేశీ వాణిజ్య విధానంలోనూ మార్పులు తెస్తున్నట్టు వివరించారు. ఈ-కామర్స్ ఎగుమతులకు ప్రోత్సాహకాలు, దేశంలో మరిన్ని ఎగుమతి హబ్లు, లావాదేవీల వ్యయాన్ని తగ్గించడం వంటి వాటికి ఈ కొత్త విధానంలో ప్రాధాన్యతనిచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.