న్యూఢిల్లీ, మార్చి 15: ఏండ్ల తరబడి అగ్గువకే లభిస్తున్న టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇక ప్రియం కానున్నాయి. వచ్చే నెల నుంచి టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలను 10 నుంచి 20 శాతం పెంచాలని పలు జీవిత బీమా సంస్థలు నిర్ణయించాయి. పాలసీదారు చనిపోతే బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసానివ్వడంలో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు ముందుంటాయి. అందుకే వీటికి విశేష ఆదరణ లభిస్తున్నది.
కరోనా ప్రభావం.. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలపైనా పడింది. ఈ మహమ్మారి కారణంగా ఎంతో మంది చనిపోతుండటంతో బీమా సంస్థలకు ఒక్కసారిగా క్లయిములు పెరిగాయి. ఊహించని ఈ పరిణామం సంస్థలను నష్టపరుస్తున్నది. అందుకే ప్రీమియం ధరలను పెంచే దిశగా అడుగులు వేస్తున్నాయి. నిజానికి గతేడాది ఏప్రిల్లోనే ప్రీమియం ధరలను 25-30 శాతం మేర కంపెనీలు పెంచాయి. మళ్లీ 10-20% పెంచేందుకు సిద్ధమయ్యాయి.
ప్రీమియం ధరలు పెరుగనున్నాయని త్వరత్వరగా ఏదో ఓ టర్మ్ పాలసీని కొనవద్దని నిపుణులు సూచిస్తున్నారు. మీమీ అవసరాలకు అనుగుణమైన పాలసీనే తీసుకోవాలని హితవు పలుకుతున్నారు. భవిష్యత్తులో మీరు లేకున్నా మీ కుటుంబ ఆర్థిక అవసరాలు సులువుగా తీరేలా పాలసీని ఎంచుకోవాలని కోరుతున్నారు. ఈ క్రమంలో కాస్త సమయం ఆలస్యమైనా.. చక్కని అంచనాలతో ప్రణాళికాబద్ధంగా నిర్ణయం తీసుకోవడం ముఖ్యమని ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో ఆర్ఎం విశాఖ చెప్తున్నారు.