హైదరాబాద్, జూలై 11(బిజినెస్ బ్యూరో): అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ సొల్యుషన్స్ సంస్థ టెక్వేవ్..తెలంగాణలో తన వ్యాపారాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్నది. ఇప్పటికే హైదరాబాద్లో రెండు కార్యాలయాలతోపాటు ఖమ్మంలోనూ ఆఫీస్ను ఆరంభించిన సంస్థ..తాజాగా వరంగల్లో తన ఆఫీస్ను ప్రారంభించబోతున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ నగరంలో కార్యాలయాన్ని తెరుస్తామని కంపెనీ కో-ఫౌండర్, సీఈవో జీ రాజశేఖర్ తెలిపారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు, ఇందుకోసం రూ.5 కోట్ల వరకు నిధులను వెచ్చించనున్నట్లు ఆయన ప్రకటించారు. తాము రాష్ట్రంలో కార్యకలాపాల కోసం కొత్తగా 100-150 మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకోవడానికి కసరత్తు చేసున్నామని, ముఖ్యంగా క్యాంపస్లలో జరిగే రిక్రూట్మెంట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఆఫీస్లో 120 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, ఈ డిసెంబర్ నాటికి ఈ సంఖ్యను 250కి పెంచుకోనున్నట్లు ప్రకటించారు.
వలసలతో ఇబ్బంది
ఐటీ రంగానికి చెందిన అన్ని సంస్థలు వలసలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని రాజశేఖర్ చెప్పారు. ఇండస్ట్రీలో వలసల శాతం సరాసరిగా 25-30 శాతంగా ఉంటే అదే తమ సంస్థలో 11 శాతంగా ఉన్నదని, భవిష్యత్తులో దీనిని తగ్గించడానికి పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గడిచిన రెండేండ్లలో ఉద్యోగల వలసలు భారీగా పెరిగాయని, ఐటీ రంగంలో అవకాశాలు అధికంగా ఉండటం ఇందు కు కారణమన్నారు. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులకు తగ్గట్టుగా ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నప్పటికీ సిబ్బంది ఏడాది నుంచి రెండేండ్లలో కంపెనీ మారిపోతున్నారు.
రాష్ట్రంలో ప్రతిభకు కొదవ లేదు
రాష్ట్రంలో ప్రతిభ కలిగిన వారికి కొదవ లేదని ఆయన వ్యాఖ్యానించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలు ఇక్కడ ఉండటం ఐటీ సంస్థలకు కలిసొచ్చే అంశాలని, ముఖ్యంగా ఇక్కడి నుంచి అంతర్జాతీయ సంస్థలు రిక్రూట్ చేసుకుంటున్నాయన్నారు. ప్రస్తుతం సంస్థలో 2,500 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, 2025 నాటికి ఈ సంఖ్యను 8 వేలకు పెంచుకోనున్నట్లు ఆయన ప్రకటించారు.