Tax Saving on FDs | మార్చి వచ్చిందంటే.. ఆదాయం పన్ను చెల్లింపులు.. దాని నుంచి మినహాయింపులకు వివిధ మదుపు పథకాల్లో పెట్టుబడులకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇస్తారు. వాటిల్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ (ఎఫ్డీ) ఒకటి. ఈ పథకం కింద నిర్ధిష్ఠ మొత్తం నగదు నిర్దేశిత కాలం డిపాజిట్ చేస్తే ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద పన్ను ఆదా చేయొచ్చు. ఐదేండ్ల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లకు ఫిక్స్డ్ టెన్యూర్ లేదా లాక్ ఇన్ పీరియడ్ ఉంటాయి. సీనియర్ సిటిజన్లకు అత్యంత ప్రజాదరణ పొందిన ఫైనాన్సియల్ ఇన్స్ట్రుమెంట్లలో బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ పథకం ఒకటి. పన్ను ఆదా చేయడంతోపాటు నిర్దిష్ట మొత్తం వడ్డీ ఆదాయం కూడా పొందొచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లలో సీనియర్ల మదుపుపై ఎటువంటి ముప్పు ఉండదు.
ఈక్విటీల్లో అంటే స్టాక్ మార్కెట్లతో పోలిస్తే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్లో మదుపు చేయడం సురక్షితం. అందుకే సీనియర్ సిటిజన్లలో అత్యధికులు భారీ మొత్తంలో బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తుంటారు. 60 ఏండ్లు దాటిన వృద్ధులకు అదనంగా 0.25-0.65 శాతం వడ్డీ ఆదాయం కూడా లభిస్తుంది. కరోనాతో దెబ్బ తిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రస్తుతం వడ్డీరేట్లు రికార్డు స్థాయిలో పడిపోయినా.. ఇప్పుడిప్పుడే పరిస్థితి మెరుగవుతున్నది.
ఇండస్ ఇండ్ బ్యాంక్ —- 7 శాతం
ఆర్బీఎల్ బ్యాంక్ — —— 6.8%
ఐడీఎఫ్సీ బ్యాంక్ ———- 6.75%
యాక్సిస్ బ్యాంక్ ———– 6.5 %
డీసీబీ బ్యాంక్ ————— 6.45%
ఒక ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద పన్ను మినహాయింపునకు గరిష్ఠ పరిమితి రూ.1.50 లక్షలు. తాజాగా ఇటీవల చేసిన సవరణ ఐటీ చట్టంలోని 80టీటీబీ సెక్షన్ ప్రకారం బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్లపై పన్ను మినహాయింపు పొందొచ్చు. సీనియర్ సిటిజన్లు ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం రూ.50 వేల వరకు పన్ను రాయితీ పొందొచ్చు. ఈ మొత్తానికి బ్యాంకులు ఎటువంటి టీడీఎస్ వసూలు చేయవు. పన్ను మినహాయింపు పొందడానికి సీనియర్ సిటిజన్లు ఐటీ చట్టంలోని ఫామ్ 15 హెచ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకున్న వారు తప్పనిసరిగా నామినీని చేర్చాలి. నామినేషన్ సబ్మిట్ చేయడానికి ఫామ్ డీఏ1 తప్పనిసరిగా పూరించి సమర్పించాలి.