న్యూఢిల్లీ, జూన్ 20: కేంద్ర ప్రభుత్వం నుంచి టాటాల గూటికి చేరిన ఎయిర్ ఇండియా లిమిటెడ్.. భారీ ఎత్తున విమానాలను కొనుగోలు చేస్తున్నట్టు సమాచారం. కొత్తగా 300 ఎయిర్క్రాఫ్ట్లను తీసుకునే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. ఇదే జరిగితే వాణిజ్య విమానయాన రంగ చరిత్రలో ఇప్పటిదాకా నమోదైన భారీ ఆర్డర్లలో ఇదీ ఒకటి కానున్నదని సంబంధిత వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థగా ఒకప్పుడు నష్టాల ఊబిలో ఉక్కిరిబిక్కిరైన ఎయిర్ ఇండియాకు కొత్త రూపం ఇస్తామని కొనేటప్పుడే టాటా గ్రూప్ చెప్పింది. ఇందుకు తగ్గట్టుగానే విమానాల శ్రేణిని విస్తరించే పనిలో పడిందంటున్నారు.
ఏ320, 737 మ్యాక్స్లు
ఎయిర్బస్ ఏ320నియో ఫ్యామిలీ జెట్స్ లేదా బోయింగ్ 737 మ్యాక్స్ మోడల్స్ను కొనేందుకు టాటా గ్రూప్ ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఇక మొత్తం 300 విమానాలూ ఒకే కంపెనీకి చెందినవైనా?.. లేదా సగం ఎయిర్బస్, మరో సగం బోయింగ్ విమానాలైనా?.. ఉండొచ్చన్న సంకేతాలున్నాయి. ఈ మేరకు ఆయా సంస్థలతో చర్చలు కొనసాగుతున్నట్టూ చెప్తున్నారు. ఈ క్రమంలోనే 300 737 మ్యాక్స్-10 జెట్స్ డీల్ విలువ 40.5 బిలియన్ డాలర్లుగా ఉంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే భారీ డీల్ కాబట్టి అంతేస్థాయిలో డిస్కౌంట్ కూడా ఉండొచ్చని సమాచారం. కాగా, ఎయిర్ ఇండియా, బోయింగ్ వర్గాలు ఈ డీల్పై మాట్లాడేందుకు నిరాకరిస్తుండగా, ఎయిర్బస్ మాత్రం తమ ప్రస్తుత కస్టమర్లతో ఎప్పుడూ కాంటాక్ట్లోనే ఉంటామని, అయితే లావాదేవీల సమాచారం గోప్యమని వ్యాఖ్యానించింది.
ఎయిర్బస్కే డిమాండ్
భారతీయ విమానయాన రంగంలో బోయింగ్తో పోల్చితే ఎయిర్బస్ ఎయిర్క్రాఫ్ట్లకే డిమాం డ్ ఎక్కువగా ఉన్నది. ఎయిర్బస్కు ఇండిగో అతిపెద్ద కస్టమర్గా కొనసాగుతున్నది. 700లకుపైగా విమానాల కోసం ఎయిర్బస్కు ఇండిగో ఆర్డర్ ఇవ్వడం విశేషం. విస్తారా, గో ఎయిర్లైన్స్ ఇండియా లిమిటెడ్, ఎయిర్ఏషియా ఇండియా లిమిటెడ్, ఫ్లై ప్లేన్స్ కూడా ఏ320నియో తరహా విమానాలకు జై కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్బస్కే ఎయిర్ ఇండియా డీల్ వెళ్లవచ్చన్న అభిప్రాయాలు పరిశ్రమ నుంచి వినిపిస్తున్నాయి. ఎయిర్బస్ నెలకు ఏ320నియో తరహా విమానాలను దాదాపు 50 తయారు చేస్తున్నది. వచ్చే ఏడాది కాలంలో 65కు, 2025 నాటికి 75కు పెంచాలని కంపెనీ చూస్తున్నది. దీంతో ఎయిర్ ఇండియా ఆర్డర్ ఎంత లేదన్నా ఏడాదిలోపే పూర్తవుతుందన్న అంచనాలున్నాయి.