న్యూఢిల్లీ/ బెర్న్ : స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో ఖాతాలు గల భారతీయుల మూడో జాబితా ఈ నెలలో కేంద్ర ప్రభుత్వానికి అందనున్నది. రెండు దేశాల మధ్య పరస్పర సమాచార మార్పిడి ఒప్పందానికి అనుగుణంగా భారత్కు స్విట్జర్లాండ్ ఈ జాబితా అందజేస్తుంది. తొలిసారి స్విస్లో రియల్ ఎస్టేట్ ఆస్తులు, ప్లాట్లు, అపార్ట్మెంట్లు, వాటిపై వచ్చే ఆదాయం వివరాల డేటా త్వరలో కేంద్రానికి అందుబాటులోకి రానున్నదని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో వీటిపై వచ్చే ఆదాయంపై పన్ను ఎగవేత అంశాలపై దృష్టి సారించేందుకు వీలు చిక్కుతుందని ఆ వర్గాల కథనం.
నల్లధనం నిల్వలను దాచుకునేందుకు స్విస్ బ్యాంకులు స్వర్గధామం అన్న గతంలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గ్లోబల్ ఫైనాన్సియల్ సెంటర్కు కీలకం అన్న విశ్వాసాన్ని తిరిగి పొందాలని స్విట్జర్లాండ్ భావిస్తున్నది. స్వచ్ఛంద సంస్థల సేవల సమాచారం, డిజిటల్ కరెన్సీల్లో పెట్టుబడుల వివరాలు భారత్కు అందుబాటులోకి రానున్నాయి. దీంతో విదేశాలకు నల్లధనం తరలింపునకు వ్యతిరేకంగా భారత్ సాగిస్తున్న పోరాటంలో ఇది కీలక మైలు రాయి కానున్నదని తెలుస్తున్నది.