న్యూఢిల్లీ, అక్టోబర్ 21: సావరిన్ గోల్డ్ బాండ్స్ తాజా ఇష్యూ అక్టోబర్ 25 నుంచి ప్రారంభంకానుంది. బాండ్లకు ఈ నెల 25 నుంచి దరఖాస్తుచేసుకోవొచ్చని గురువారం కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. ఈ ఇష్యూ ఐదు రోజులపాటు అమల్లో ఉంటుంది. 2021-22 సిరీస్ కింద మొత్తం 10 బాండ్ ఇష్యూల్ని ప్రతిపాదించగా, ఇప్పటివరకూ ఆరు దఫాలు బాండ్లను జారీచేశారు. 2021 అక్టోబర్ నుంచి 2022 మార్చి వరకూ మరో నాలుగు బాండ్ ఇష్యూలు ఉంటాయి. తాజాగా ప్రారంభంకానున్న సిరీస్-7 అక్టోబర్ 25 నుంచి అక్టోబర్ 29 వరకూ అమలవుతుంది.
నవంబర్ 2న బాండ్ల జారీ…
దరఖాస్తుదార్లకు నవంబర్ 2న బాండ్లు జారీఅవుతాయని ఆర్థిక శాఖ తెలిపింది. ఈ బాండ్లు బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్, క్లియరింగ్ కార్పొరేషన్, ఎంపికచేసిన పోస్టాఫీసులు, స్టాక్ ఎక్సేంజీల ద్వారా విక్రయిస్తారు. కేంద్ర ప్రభుత్వం తరపున రిజర్వ్బ్యాంక్ ఈ బాండ్లను జారీచేస్తుంది.