హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ): ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర సర్కార్ బాసటగా నిలుస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆర్థిక, డిజిటల్ ఇన్క్ల్యూజివ్ పేరిట ప్రాజెక్టు ఉజాగర్ ప్రోగ్రాం ద్వారా పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన శిక్షణ పొందిన మైనార్టీ మహిళలకు మంత్రి బుధవారం సర్టిఫికేట్లను అందచేశారు. వీ హబ్, మైనార్టీ సంక్షేమ శాఖ, సఫా సొసైటీ భాగస్వామ్యంతో ప్రాజెక్టు ఉజాగర్ ద్వారా వీరికి వ్యాపార మెళుకువలు, ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్న ఆయన..వ్యాపార రంగంలో నిలదొక్కుకునేందుకు సీడ్ ఫండింగ్ కూడా ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
భవిష్యత్తులో సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తలుగా ఎదిగేలా తెలంగాణ సర్కారు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించనున్నట్టు చెప్పారు. ఈ కోర్సు ను పూర్తి చేసిన 49 మంది మహిళలకు మంత్రి కేటీఆర్ ధృవీకరణ పత్రాలు అందచేశారు. కాగా, వీరిలోని 8 మంది మహిళల్లో ఐదుగురికి లక్ష రూపాయల మైనార్టీ శాఖ ద్వారా ప్రోత్సాహక చెక్కులను అందచేశారు. రాష్ట్రంలో మైనార్టీ మహిళల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడమే లక్ష్యంగా ఉజాగర్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని వీ హబ్ సీఈవో దీప్తి రావుల పేర్కొన్నారు.