Retail inflation | ఫిబ్రవరి రిటైల్ ద్రవ్యోల్బణం 6.44 శాతానికి దిగి వచ్చింది. కానీ వరుసగా రెండో నెల కూడా ఆర్బీఐ నిర్దేశిత స్థాయి కంటే ఎక్కువగా చిల్లర ద్రవ్యోల్బణం నమోదు కావడం గమనార్హం. దీంతో ఏప్రిల్ మొదటి వారంలో జరిగే ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్షలో మరో దఫా 25 బేసిక్ పాయింట్లు రెపోరేట్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదనుగుణంగా బ్యాంకులు ఇండ్ల రుణాలపై వడ్డీరేట్లు పెరుగుతాయి. జనవరిలో మూడు నెలల గరిష్ట స్థాయి 6.52 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం నమోదైన సంగతి తెలిసిందే. అంతకుముందు 2022 డిసెంబర్లో 5.72 శాతం, నవంబర్లో 5.88 శాతంగా రికార్డైంది. గతేడాది (2022) ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.07 శాతంగా నమోదైంది.
పప్పుధాన్యాలు, బియ్యం, కూరగాయలు, మాంసం, చేపలు, కోడిగుడ్ల ధరలు స్వల్పంగా తగ్గడంతో రిటైల్ ద్రవ్యోల్బణంలో కాసింత రిలీఫ్ లభించింది. తృణ ధాన్యాల ధరలు 16.73 శాతం, పాల ఉత్పత్తులు 9.65 శాతం, ఫలాలు 6.38 శాతం, హౌసింగ్ 4.83 శాతం వరకు పెరిగాయి. జనవరిలో ఆహార ద్రవ్యోల్బణం 5.94 శాతంగా రికార్డైతే ఫిబ్రవరిలో 5.95 శాతానికి దూసుకెళ్లింది.
ఫుడ్, ఫ్యూయల్ ధరల్లో అనిశ్చితి నెలకొనడంతో కోర్ ద్రవ్యోల్బణం ఆరుశాతానికి పైగా నమోదు కావడం ఆందోళనకరం. వేసవిలో వేడి గాలుల వల్ల గోధుమల దిగుబడి తగ్గుతుందని, అదే జరిగితే ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబాన్విస్ పేర్కొన్నారు. గత 14 నెలల్లో అంటే, 2022 జనవరి నుంచి 12 నెలల పాటు ఆర్బీఐ నిర్దేశిత స్థాయి కంటే ఎక్కువ ద్రవ్యోల్బణం రికార్డైంది. జనవరి-మార్చి త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం 20 బేసిక్ పాయింట్లు తగ్గి 5.7 శాతానికి దిగి వస్తుందని ఆర్బీఐ గత నెల సమీక్షలో వెల్లడించింది. కానీ అనూహ్యంగా ఫిబ్రవరి రిటైల్ ద్రవ్యోల్బణం ఆరు శాతానికంటే ఎక్కువ నమోదైంది.