Shaktikanta Das | ముంబై, ఏప్రిల్ 27: పేలవమైన వ్యాపార వ్యూహాలు సంక్షోభానికి దారితీస్తాయని తాము భావిస్తున్నందున, భారత బ్యాంక్ల వ్యాపార తీరుతెన్నులు, నమూనాలను ‘మరింత నిశితంగా’ పర్యవేక్షిస్తున్నామని రిజర్వ్బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు. సిలికాన్వ్యాలీ బ్యాంక్తో సహా కొన్ని యూఎస్ బ్యాంక్లు అనుసరించిన నాసిరకం బిజినెస్ మాడల్స్ కారణంగానే అక్కడ సంక్షోభం తలెత్తి ఉండవచ్చని అన్నారు. ఇటీవల కొన్ని పశ్చిమదేశాల్లో ఆర్థిక అస్థిరత్వం ఏర్పడినప్పటికీ, ఆర్బీఐ, భారత్ బ్యాంక్లు చేపట్టిన చర్యలతో మన బ్యాంకింగ్ వ్యవస్థ సజావుగా నిలదొక్కుకుందన్నారు.
గురువారం ఆర్బీఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో దాస్ మాట్లాడుతూ యూఎస్లో బ్యాంకింగ్ పరిణామాల నేపథ్యంలో ఆయా బ్యాంక్లు అనుసరిస్తున్న వ్యాపార నమూనాలు సరైనవో, కాదో చూడాల్సిన అవసరం ఉందని వివరించారు. బ్యాంక్ల బిజినెస్ మాడల్స్ కొన్ని సందర్భాల్లో బ్యాంక్ బ్యాలెన్స్షీట్ను రిస్క్లో పడేసి, పెద్ద సంక్షోభానికి దారితీస్తుందన్నారు. యూఎస్, యూరప్ల్లో జరిగిన బ్యాంకింగ్ సంఘటనలు అటువంటివేనని చెప్పారు.
మూలధనాన్ని పెంచుకోవాలి
కనిష్ఠ నిర్దేశిత పరిమితులకు మించి బ్యాంక్లు వాటి మూలధనాన్ని, లిక్విడిటీని పెంచుకోవడంపై దృష్టిపెట్టాలని బ్యాంక్ల యాజమాన్యాలు, బోర్డులకు ఆర్బీఐ గవర్నర్ సూచించారు. బ్యాంక్ బిజినెస్ మాడల్, వ్యూహం ఆధారంగానే వాటి ఆర్థిక పనితీరు ఉంటుందని చెప్పారు. ఇటీవలికాలంలో భారత బ్యాంక్లు ఒత్తిడిని తట్టుకోవడం, మూలధనాన్ని సమకూర్చుకోవడంలో మెరుగుదల కనపర్చాయన్నారు. 2022 మార్చిలో 5.8 శాతంగా ఉన్న స్థూల ఎన్పీఏలు 2022 డిసెంబర్కల్లా 4.41 శాతానికి తగ్గాయని వెల్లడించారు. 2021 మార్చినాటికి అవి 7.3 శాతంగా ఉన్నాయన్నారు. అలాగే 2022 డిసెంబర్లో భారత బ్యాంక్ల క్యాపిటల్ అడిక్వసీ నిర్దేశిత కనిష్ఠస్థాయికంటే అధికంగా 16.1 శాతానికి పెరిగిందన్నారు.