నెలరోజుల క్రితం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కొత్త ఆదాయపు పన్ను పద్ధతిలో రిటర్న్ వేసేవారిని ప్రోత్సహించేందుకు భారీగా పరిమితిని పెంచడంతో పాటు స్టాండర్డ్ డిడక్షన్ను సైతం అనుమతించారు. పాత పన్ను విధానంలో పన్ను భారాన్ని తక్కువ చేసుకునేందుకు పలు సాధానాలు అందుబాటులో ఉండటంతో కొత్త పద్ధతిలో రిటర్న్ దాఖలు చేయడానికి పన్ను చెల్లింపుదార్లు విముఖత చూపుతున్నందున, తాజాగా ఈ విధానంలో పన్ను మిహాయింపు పరిమితిని భారీగా రూ. 7 లక్షలకు పెంచారు. దీంతో పాటు మొత్తం ఆదాయం నుంచి పన్ను భారాన్ని తగ్గించుకునే దిశగా ఆరు మినహాయింపులకు ఛాన్స్ ఉంది.
వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లకు ఏ విధానంలో తక్కువ పన్ను భారం ఉంటుందో గణించుకునేందుకు ఇటీవల ఆదాయపు పన్ను శాఖ ఒక ట్యాక్స్ క్యాలుక్యులేటర్ను కూడా వెబ్సైట్కు అనుసంధానించింది. అయితే తుది నిర్ణయం తీసుకునేముందు..న్యూ ట్యాక్స్ రిజీమ్లో అర్హమైన మినహాయింపుల పట్ల అవగాహన కలిగి ఉండాలని పన్ను నిపుణులు సూచిస్తున్నారు. పాత పద్ధతితో పాటు కొత్త విధానంలోనూ వర్తించే ఆరు మినహాయింపులివి…
స్టాండర్డ్ డిడక్షన్
పన్ను చెల్లింపుదార్లకు బాగా పరిచయం ఉన్న పన్ను మినహాయింపు ఇది. పాత పద్ధతిలో ఆటోమేటిక్గా వర్తించే రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ను కొత్త పద్ధతిలోనూ అనుమతిస్తూ తాజా బడ్జెట్లో ప్రతిపాదించారు. ఈ డిడక్షన్ కోసం ఎటువంటి ప్రూఫ్లూ సమర్పించాల్సిన అవసరం లేదు. ఈ స్టాండర్డ్ డిడక్షన్ వేతన జీవులు, పెన్షనర్లకే వర్తిస్తుంది. వ్యాపారస్తులకు, వృత్తి నిపుణులకు ఈ పన్ను ప్రయోజనం లభించదు.
ఈపీఎఫ్కు యాజమాన్యం చెల్లించే మొత్తం
ఉద్యోగి బేసిక్ వేతంలో 12 శాతం వరకూ ఈపీఎఫ్ ఖాతాకు యాజమాన్యం చెల్లించే మొత్తానికి కొత్త పన్ను పద్ధతిలో మినహాయింపు ఉంది. అయితే యాజమాన్యం నుంచి పొందే రిటైర్మెంట్ ప్రయోజనాలు ఏడాదికి రూ.7.5 లక్షలకు మించకుండా ఉంటేనే ఈపీఎఫ్కు చెల్లించే మొత్తాన్ని తగ్గించుకునే వీలుంటుంది.
అద్దె ఆదాయంపై స్టాండర్డ్ డిడక్షన్
మీకు సొంత ఇంటిని అద్దెకు ఇచ్చినట్లయితే, ఏడాదికి పొందే అద్దె ఆదాయంలో 30 శాతం స్టాండర్డ్ డిడక్షన్ను క్లెయిం చేసుకోవచ్చు. మున్సిపాలిటీ పన్నులను తగ్గించిన మొత్తంపై ఈ డిడక్షన్ను చూపించవచ్చు.
పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజనపై పొందే మొత్తం
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్),సుకన్య సమృద్ధి యోజనల్లో చేసిన పెట్టుబడుల నుంచి అందే మెచ్యూరిటీ మొత్తంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే వీటిలో చేసే పెట్టుబడుల్ని కొత్త పన్ను పద్ధతిలో మినహాయించుకునే వీలు లేదు. పాత పన్ను విధానంలో మాత్రం సెక్షన్ 80సీ కింద వీటిలో పెట్టుబడి చేసే రూ.1.5 లక్షల మొత్తం వరకూ పన్ను మినహాయింపు ఉంది.
ఉద్యోగి ఎన్పీఎస్కు యజమాని చెల్లించే మొత్తం
రెండు పద్ధతుల్లోనూ దీనిని మొత్తం ఆదాయంలోంచి మినహాయించవచ్చు. అయితే నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) సంబంధిత మినహాయింపులైన సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలు, 80సీసీడీ (1బీ) కింద రూ.50,000 మాత్రం కొత్త రిజీమ్లో తగ్గించుకునే వీలు లేదు. కానీ సెక్షన్ 80సీసీడీ (2) కింద ఉద్యోగి వేతనం (బేసిక్+డీఏ)లో 10 శాతం వరకూ ఎన్పీఎస్కు యాజమాన్యం చేసే చెల్లింపునకు కొత్త పద్ధతిలో మినహాయింపు ఉంది. ఇది ప్రభుత్వ ఉద్యోగులకైతే 14 శాతం. ‘యాజమాన్యం చెల్లించే మొత్తం తొలుత ఉద్యోగి జీతంలో చూపించి ఉండాలి. తదుపరి వేతనంలో 10 శాతం డిడెక్షన్ను సెక్షన్ 80సీసీడీ (2) కింద అనుమతిస్తారు’ అని వ్యక్తిగత పన్ను నిపుణుడు కుల్దీప్ కుమార్ వివరించారు. ఈ పన్ను ప్రయోజనాన్ని పొందేందుకు వీలుగా ఉద్యోగులు వారి జీతభత్యాల్ని పునర్వ్యవస్థీకరించమంటూ యాజమాన్యాలు, హెచ్ఆర్లతో చర్చించవచ్చని ట్యాక్స్స్పానర్.కామ్ సీఈవో సుధీర్ కౌశిక్ చెప్పారు.
జీవిత బీమా మెచ్యూరిటీ సొమ్ముకు మినహాయింపు
జీవిత బీమా పాలసీల కాలపరిమితి ముగిసిన తర్వాత అందే మొత్తానికి రెండు పన్ను విధానాల్లోనూ పన్ను ఉండదు. అయితే మదుపుతో కలగలిసిన యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ(యులిప్) లేదా ఎండోమెంట్ ప్లాన్లకు కొన్ని పరిమితులను 2021-22 బడ్జెట్లో కేంద్రం ప్రవేశపెట్టింది. 2021 ఫిబ్రవరి 1 తర్వాత కొనుగోలు చేసిన యులిప్ పాలసీల ప్రీమియం రూ.2.5 లక్షలు మించితే, వాటి మెచ్యూరిటీపై వచ్చే మొత్తంపై పన్ను విధిస్తారు. 2023 బడ్జెట్లో ఈ నియంత్రణల్ని ఎండోమెంట్ ప్లాన్స్కు సైతం పొడిగించారు. 2023 ఏప్రిల్ 1 తర్వాత పాలసీల ప్రీమియం చెల్లింపులు రూ. 5 లక్షలు మించితే, వాటి కాలపరిమితి అనంతరం వచ్చే ఆదాయంపై పన్ను ఉంటుంది. ఈ పాలసీలన్నింటికి పాలసీదారు మరణాంతరం నామినేటెడ్ కుటుంబ సభ్యులు అందుకునే మొత్తంపై పన్ను ఉండదు.