న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా ప్రస్తుత సీఈవో సీహెచ్ ఎస్ఎస్ మల్లిఖార్జునరావు పదవీ కాలాన్ని 2022 జనవరి 31 వరకు పొడిగిస్తూ కేంద్ర నియామకాల క్యాబినెట్ కమిటీ (ఏసీసీ) నిర్ణయం తీసుకున్నది. వచ్చేనెల 18న ఆయన పదవీ కాలం ముగుస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీఈవో కం ఎండీగా 2019 అక్టోబర్ ఒకటో తేదీన నియమితులయ్యారు. అంతకుముందు ఆయన అలహాబాద్ బ్యాంక్ సీఈవో కం ఎండీగా బాధ్యతలు నిర్వహించారు.
పలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ఎండీలు, సీఈవోల పదవీ కాలాన్ని కూడా పొడిగించింది. నవంబర్ ఒకటో తేదీన రిటైర్ కానున్న యుకో బ్యాంక్ ఎండీ కం సీఈవో అతుల్ కుమార్ పదవీ కాలాన్ని రెండేండ్లు పొడిగించింది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సీఈవో కం ఎండీ ఏఎస్ రాజీవ్ పదవీ కాలాన్ని రెండేండ్లు పొడిగించింది. వచ్చే డిసెంబర్ ఒకటో తేదీన ఆయన రిటైర్ కావాల్సి ఉంది. ఇంకా బ్యాంక్ ఆఫ్ బరోడా, పీఎన్బీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల పదవీ కాలాన్ని పొడిగించింది.