Paytm in Crisis | ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుందా.. కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ను ఆర్బీఐ ఆదేశించిన నేపథ్యంలో పేటీఎం స్క్రిప్ట్ భారీగా నష్టపోయింది. రెండు రోజుల్లో (సోమ, మంగళవారాలు) 20 శాతం నస్టపోయింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో ఇప్పటి వరకు టాప్-100 జాబితాలో ఉన్న పేటీఎం ఆ హోదా కోల్పోయింది. మంగళవారం ఉదయం 10.48 గంటలకు పేటీఎం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.40,863 కోట్ల వద్ద నిలిచింది. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో పేటీఎం స్థానం 112 స్థానానికి పడిపోయింది.
స్టాక్ మార్కెట్లో లిస్టయిన దగ్గర నుంచి పేటీఎం రూ. 60,537 కోట్ల మార్కెట్ క్యాపిటల్ కోల్పోయింది. గతేడాది నవంబర్ 18న స్టాక్ మార్కెట్లో పేటీఎం లిస్టయింది. నాడు ఐపీవో ద్వారా స్టాక్ మార్కెట్లలో లిస్టయిన నాడు పేటీఎం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.01 లక్షల కోట్లతో లిస్టెడ్ కంపెనీల్లో 51వ స్థానంలో నిలిచింది.
నవంబర్ 18న లిస్టింగ్ నాడు ఇంట్రాడే ట్రేడింగ్లో రికార్డు స్థాయిలో పేటీఎం స్క్రిప్ట్ రూ.1961.05 వరకు దూసుకెళ్లింది. కానీ పోస్ట్ లిస్టింగ్ తర్వాత పేటీఎం జాతకం తిరగబడింది. పేటీఎం ఐపీవో లిస్టింగ్ ప్రైస్ రూ.2,150 నుంచి 71 శాతం నష్టపోయింది. మంగళవారం పేటీఎం స్క్రిప్ట్ 9 శాతం పతనమై రూ.616.55లకు పడిపోయింది. భారీగా షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. అటు బీఎస్ఈ, ఇటు ఎన్ఎస్ఈల్లో 9.71 మిలియన్ల ఈక్విటీ షేర్లు చేతులు మారాయి.
చైనా కంపెనీలకు డేటా షేరింగ్ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నెల 11న ఆర్బీఐ నిషేధం విధించడంతో గత రెండు రోజుల్లో పేటీఎం స్క్రిప్ట్ 20 శాతం నష్టపోయింది. అంతేకాదు కొత్త కస్టమర్లను కూడా చేర్చుకోవద్దని ఆర్బీఐ ఆదేశించింది. కంపెనీ లావాదేవీల అడిటింగ్కు ఐటీ అడిటింగ్ కంపెనీని నియమించుకోవాలని కూడా పేర్కొంది. అడిటింగ్ సంస్థ నివేదిక తర్వాత ఆర్బీఐ తుది నిర్ణయం తీసుకోనున్నది. పేటీఎంపై ఆర్బీఐ నిషేధం విధించడం ఇది రెండోసారి. 2018లో కేవైసీ నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణల నేపథ్యంలో తొలిసారి పేటీఎంపై ఆర్బీఐ నిషేధం విధించింది.
కానీ తమ ఆర్థిక లావాదేవీలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపలేదని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్) తెలిపింది. పేటీఎం యూపీఐ, పేటీఎం వాలెట్, పేటీఎం ఫాస్టాగ్, బ్యాంక్ ఖాతాల లావాదేవీలు యథాతథంగా సాగుతున్నాయన్నది. సంచలనం కోసమే చైనా కంపెనీలకు తమ ఖాతాదారుల డేటా షేర్ చేసినట్లు ఒక ఆంగ్ల దినపత్రిక వార్తా కథనం ప్రచురించిందని ఆరోపించింది. ఆ పత్రిక కథనం పూర్తిగా తప్పని స్పష్టం చేసింది.