హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): కరోనా కష్టకాలంలో ఒడిదుడుకులు ఎదురైనా రాష్ట్ర పారిశ్రామిక రంగం అభివృద్ధి బాటలోనే పయనిస్తున్నది. ప్రభుత్వం పలు కొత్త పారిశ్రామిక వాడలతోపాటు, హైదరాబాద్ మెగా సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్ను అభివృద్ధి చేయడం కలిసొచ్చింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు అనేక చర్యలు చేపట్టింది. టీఎస్ ఐ-పాస్ను ప్రవేశపెట్టి పరిశ్రమల అనుమతులకు సింగిల్ విండో విధానం అమలు చేస్తున్నది. కొవిడ్ సంక్షోభంలోనూ అదే ఒరవడి కొనసాగింది.
ఏరోస్పేస్-డిఫెన్స్
హైదరాబాద్కు 2020లో సివిల్ ఏవియేషన్ ఫర్ ఏరోస్పేస్ రంగంలో బెస్ట్ సిటీ అవార్డు, ఎఫ్డీఐ ఏరోస్పేస్ సిటీస్లో మొదటి ర్యాంక్ దక్కింది. బోయింగ్, సఫ్రాన్లు రాష్ట్రంలో కొత్త ప్లాంట్లను తెస్తున్నాయి.
టెక్స్టైల్ పరిశ్రమ
రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులను కరోనా కష్టాల నుంచి ఆదుకొనేందుకు గతేడాది నేతన్నకు చేయుత పథకంలో మూడేండ్ల లాక్-ఇన్ గడువును ఎత్తివేసింది. చేనేత కార్మికులు తమ పొదుపు సొమ్మును తీసుకొనే వీలు కల్పించింది. వెల్స్పన్ కంపెనీ రూ.415 కోట్లతో అడ్వాన్స్టెక్స్టైల్స్ ప్రాజెక్టును చేపట్టింది. ఇది హైదరాబాద్లో సంస్థకు రెండో పెట్టుబడి. వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు లో గణేషా ఎకోస్పేర్ రెండు కొత్త ప్రాజెక్టులను రూ.500 కోట్లతో ఏర్పాటు చేస్తున్నది. ఇక కైటెక్స్.. ఇటీవలే రూ.1,000 కోట్ల పెట్టుబడులతో వచ్చింది. రాబోయే రెండేండ్లలో 4వేల కొత్త ఉద్యోగాలు రానున్నాయి.
ఫుడ్ ప్రాసెసింగ్
బండ తిమ్మాపూర్, బండ మైలారంలో రెండు ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల ప్రారంభం జరిగింది. వీటిలోకి సుమారు రూ.15,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మరిన్ని పార్కులు రానున్నాయి.
ఆటోమోటివ్ ఇండస్ట్రీ
తెలంగాణ రాష్ట్ర ఈవీ, ఎనర్జీ స్టోరేజ్ పాలసీ 2020-30ని గతేడాది అక్టోబర్లో ఆవిష్కరించారు. మైట్రా ఎనర్జీ, ఒలెక్ట్రా, ఈటీవో మోటర్స్, ప్యూర్ ఈవీ, గయామ్ మోటర్స్, ఎట్రియో అండ్ ఏఆర్ఏఐలతో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ రూ.1,110 కోట్లతో గ్లోబల్ డిజిటల్ హబ్ను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తామన్నది.
ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగం
ఐసీఎమ్మార్ ఆమోదించిన దేశంలోనే మొట్టమొదటి ఆర్టీపీసీఆర్ కిట్ హైదరాబాద్లో తయారైందే. కరోనాకు మొదటి దేశీయ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది హైదరాబాద్లోని భారత్ బయోటెక్ కంపెనీయే. దేశంలోని 5 ప్రధాన వ్యాక్సిన్ తయారీ కంపెనీల్లో 4 హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలోనే ఉన్నాయి. జీనోమ్ వ్యాలీ దేశంలోనే అతిపెద్ద ఆర్అండ్డీ క్లస్టర్. బయోఫార్మా హబ్గా ఎదుగుతున్నది. మెడ్ట్రానిక్ రూ.1,200 కోట్లతో ఆర్అండ్డీ సెంటర్ను తెస్తుండగా, సాయి లైఫ్సైన్సెస్ 83,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆర్అండ్డీ సౌకర్యాన్ని ప్రారంభించింది.