ఆఫీస్ స్పేస్ మార్కెట్లో హైదరాబాద్ దూసుకుపోతున్నది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వృద్ధిపరంగా, లీజులపరంగా ఆకర్షణీయ ప్రగతిని చూపుతున్నది.
అన్ని రంగాల కార్పొరేట్ సంస్థలకూ అనువైన చోటుగా భాగ్యనగరం భాసిల్లుతున్నదని ఎప్పటికప్పుడు విడుదలవుతున్న గణాంకాలే నిదర్శనం.
న్యూఢిల్లీ, జూలై 4: దేశీయ ఆఫీస్ స్పేస్ మార్కెట్ కరోనా ప్రభావిత పరిస్థితుల నుంచి బయటపడుతున్నది. ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో హైదరాబాద్సహా దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజులు జోరుగా సాగినట్టు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొల్లీర్స్ ఇండియా సోమవారం తెలిపింది. హైదరాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు, ముంబై, చెన్నై, పుణె నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజులు నిరుడు ఏప్రిల్-జూన్తో చూస్తే ఈసారి 2.5 రెట్లకుపైగా ఎగిసి 14.7 మిలియన్ చదరపు అడుగులను తాకినట్టు తాజా వివరాల్లో చెప్పింది. పోయినసారి 5.6 మిలియన్ చదరపు అడుగుల్లోనే లీజులున్నట్టు పేర్కొన్నది. కరోనా పరిస్థితులు ఇందుకు కారణమనీ స్పష్టం చేసింది. ఇక ఈ ఏడాది జనవరి-జూన్లో ఈ ఆరు నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజులు 27.5 మిలియన్ చదరపు అడుగులుగా ఉన్నాయి. గత ఏడాది 10.3 మిలియన్ చదరపు అడుగులుగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆఖరుకల్లా 40-45 మిలియన్ చదరపు అడుగులకు లీజులు చేరవచ్చని కొల్లీర్స్ అంచనా వేసింది.
కొత్త ప్రాజెక్టుల్లో హైదరాబాదే టాప్
మార్కెట్లో కొత్తగా ఆఫీస్ స్పేస్ను అత్యధికంగా అందుబాటులోకి తెచ్చే నగరాల్లో హైదరాబాదే ముందున్నది. ఈ ఏప్రిల్-జూన్లో గ్రేడ్ ఏ స్టాక్కు అదనంగా 9.4 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ తోడైంది. ఇందులో 40 శాతం హైదరాబాద్ నుంచే వచ్చింది. 17 శాతంతో బెంగళూరు రెండో స్థానంలో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, వేగంగా ఇస్తున్న అనుమతులు కార్పొరేట్లను తెలంగాణకు క్యూ కట్టిస్తున్నాయి. ప్రతిభ, నైపుణ్యం కలిగిన మానవ వనరులకూ కొదవే లేకపోవడం కూడా కలిసొస్తున్నది.
భాగ్యనగరంలోనే భారీ డీల్స్
దేశీయ ఆఫీస్ స్పేస్ మార్కెట్లో భారీ లావాదేవీలకు హైదరాబాదే అడ్డాగా నిలుస్తున్నది. ఈ ఏప్రిల్-జూన్లో జరిగిన ఆఫీస్ స్పేస్ లీజుల్లో సగానికిపైగా భారీ డీల్సే ఉండగా, ఇందులో 60 శాతానికిపైగా టెక్నాలజీ మార్కెట్లుగా వెలుగొందుతున్న హైదరాబాద్, బెంగళూరుల్లోనే జరిగాయని కొల్లీర్స్ తెలిపింది. బ్యాంకింగ్, ఆర్థిక, బీమా రంగ సంస్థలే దాదాపు 3.5 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ స్థలాలను లీజుకు తీసుకున్నట్టు తేలింది.