హైదరాబాద్, ఆగస్టు 26: అమెరికాకు చెందిన ఇండస్ట్రియల్ టెక్నాలజీ సేవల సంస్థ ఆక్టేవ్ ఇంటెలిజెన్స్..హైదరాబాద్లో టెక్నాలజీ, ఇన్నోవేషన్ సెంటర్ను నెలకొల్పింది. హైటెక్ సిటీలో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంతర్జాతీయ కంపెనీలకు తొలి ప్రాధాన్యంగా హైదరాబాద్ మారిపోయిందని, తమ జీసీసీని ఇక్కడే ప్రారంభిస్తున్నాయని, గడిచిన ఏడాదికాలంలో 75 సంస్థలు ఇక్కడ జీసీసీలను నెలకొల్పాయన్నారు.
వచ్చే ఏడాది మరో 100కి పైగా జీసీసీల ఏర్పాటు చేసేవిధంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఈ సందర్భంగా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ శేఖర్ కొనిదెన మాట్లాడుతూ.. రాబోయే సంవత్సరాల్లో 2 వేల మంది ఇంజినీర్లకు విస్తరించే ప్రణాళికలో ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్టు, దీంతో సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, ఏఐ, డాటా, క్లౌడ్ వంటి నూతన టెక్నాలజీ సేవలను అంతర్జాతీయ క్లయింట్లకు ఇక్కడి నుంచే అందించనున్నట్టు చెప్పారు.
రాష్ట్రంలో పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అంతరాన్ని తగ్గించాలనే సంకల్పంతో సిల్లింగ్ ఎకోసిస్టమ్ను బలోపేతం చేస్తున్నామని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లో బోయింగ్ ఎల్ఎల్ఎఫ్, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ) సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ‘బోయింగ్ సిల్లింగ్ ప్రోగ్రామ్’ను విజయవంతంగా పూర్తి చేసిన యువత, దివ్యాంగులు, వెటరన్స్కు ఆయన ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీ, ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు కూడా ఎప్పటికప్పుడు మారుతున్నాయన్నారు. యంగ్ ఇండియా సిల్స్ వర్సిటీ ద్వారా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్టు శ్రీధర్బాబు చెప్పారు. పరిశ్రమ ఆధారిత శిక్షణ అందించేందుకు ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.