Coins @ ATM | మనకు డబ్బు కావాల్సి వస్తే బ్యాంకుకు వెళ్లే వాళ్లం. ఏటీఎంలు రావడంతో డెబిట్ కార్డులు వాడి డబ్బులు తెచ్చుకుంటున్నాం. ఏటీఎంల నుంచి ఇప్పటివరకు మనకు నోట్లే అందుబాటులో ఉండేవి. ఇకపై నాణేలు కూడా పొందేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) సిద్ధం చేస్తున్నది. పైలట్ ప్రాజెక్టుగా దేశంలోని 12 నగరాల్లో ప్రారంభించనున్నారు. ఫలితాల ఆధారంగా మిగతా ప్రాంతాల్లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
కరెన్సీ నోట్లు కాకుండా ఏటీఎంల నుంచి నాణేలు విత్డ్రా చేసుకునే సౌకర్యాన్ని ఆర్బీఐ తీసుకొచ్చింది. ఇవాళ ద్రవ్య విధాన సమావేశం అనంతరం నాణేల కోసం వెండింగ్ మెషీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. క్యూఆర్ కోడ్ ఆధారంగా కాయిన్ వెండింగ్ మెషీన్లను ఇన్స్టాల్ చేయాలని యోచిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఇందుకోసం పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. నాణేల లభ్యతను పెంచడమే లక్ష్యమని, తొలిదశలో దేశంలోని 12 నగరాల్లో ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు.
వినియోగదారులు తమ యూపీఐ యాప్ ద్వారా మెషిన్ పైన ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలి. తద్వారా కాయిన్ వెండింగ్ మెషీన్ల నుంచి మనకు కావాల్సినన్ని నాణేలను సెలక్ట్ చేసుకోవడం ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు. అనంతరం మనం పొందిన నాణేల మొత్తం మన రిజిస్టర్డ్ బ్యాంకు ఖాతా నుంచి కట్ అవుతుంది. ఏటీఎంలలో నాణేల లభ్యతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.