హైదరాబాద్, నవంబర్ 8: రిలయన్స్ రిటైల్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న స్వదేశ్ స్టోర్లలో తొలి స్టోర్ను హైదరాబాద్లో ఏర్పాటుచేసింది. బుధవారం రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్పర్సన్ నీతా అంబానీ ఈ స్టోర్ను ప్రారంభించారు. జూబ్లీహిల్స్లోని అల్కజార్ మాల్లో 20వేల చదరపు అడుగుల్లో దీన్ని తీసుకొచ్చారు. నైపుణ్యం, ప్రతిభ కలిగిన దేశీయ కళాకారులతో తయారైన అత్యుత్తమ వస్తూత్పత్తులను ఈ స్టోర్లలో విక్రయిస్తారు. నాణ్యమైన ఆహారోత్పత్తులు, హస్తకళలు, చిత్రాలు, చేనేత వస్ర్తాలు, దుస్తులు, ఆభరణాలు, గృహాలంకరణ వస్తువులు, కార్పెట్లు, మట్టితో తయారు చేసిన కుండలు, ఇతరత్రా కళాఖండాలు ఇక్కడ లభిస్తాయి.
‘భారతీయ సంప్రదాయ కళలు, కళాకారులను ప్రోత్సహించడానికి, వాటికి దేశ, విదేశాల్లో మరింత గుర్తింపును తీసుకురావడానికి ఈ స్వదేశ్ స్టోర్లు దోహదం చేయగలవు. భారత్లోనేగాక, అమెరికా, ఐరోపా తదితర దేశాల్లోనూ ఈ స్టోర్లను ఏర్పాటు చేస్తాం’ అని ఈ సందర్భంగా నీతా అంబానీ అన్నారు. ఇప్పటికే ముంబైలో తాము ఏర్పాటుచేసిన నీతా ముకేశ్ అంబానీ సాంస్కృతిక కేంద్రం (ఎన్ఎంఏసీసీ)లోనూ అద్భుత రీతిలో ఓ స్వదేశ్ ఎక్స్పీరియన్స్ జోన్ను ఆవిష్కరించామని గుర్తుచేశారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి దేశంలోని ప్రముఖ నగరాల్లోనూ ఈ స్టోర్లను తేనున్నారు. కాగా, సానియా మీర్జా, పీవీ సింధు, నమ్రతా శిరోద్కర్ తదితర క్రీడా, సినీ సెలబ్రిటీలూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.